వన్డే వరల్డ్ కప్ మరోసారి టీమిండియా చేజారింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్లో టీమిండియానే ట్రోఫీ ముద్దాడుతుందని అంతా అనుకున్నారు. కానీ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన భారత జట్టుకు అనుకున్న ఆరంభం దక్కలేదు. శుభ్మన్ గిల్ (4) ఫెయిలయ్యాడు. అయితే రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లీ (54) ఇన్నింగ్స్ నిలబెట్టారు.
అయితే అనవసర షాట్కు ప్రయత్నించిన రోహిత్ కూడా ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ (4) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో కోహ్లీ, కేఎల్ రాహుల్ (66) ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ఇక కోహ్లీ అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ తేలిపోయింది. జడేజా (9), సూర్యకుమార్ యాదవ్ (18) ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది.

లక్ష్య ఛేదనలో ఆసీస్ను భారత పేసర్లు కొంత కట్టడి చేశారు. డేవిడ్ వార్నర్ (7), మిచెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4)ను త్వరగానే పెవిలియన్ చేర్చారు. కానీ ట్రావిస్ హెడ్ (137), మార్నస్ లబుషేన్ (58 నాటౌట్) మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో మంచు ప్రభావం కూడా పెరగడంతో భారత బౌలర్లు తడబడ్డారు. దీంతో ఆసీస్ జట్టు కేవలం 43 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోవడంపై పాకిస్తాన్ మాజీ లెజెండ్ షోయబ్ అక్తర్ స్పందించాడు. భారత జట్టు మెరుగైన పిచ్ రెడీ చేసుకోవాల్సిందని అన్నాడు. 'భారత జట్టు అదృష్టంతో ఫైనల్ చేరలేదు. అద్భుతంగా ఆడుతూ ఫైనల్ చేరుకున్నారు. కానీ ఫైనల్ కోసం ఉపయోగించిన పిచ్ మాత్రం నన్ను పూర్తిగా నిరాశ పరిచింది. భారత్ ఈ మ్యాచ్ కోసం మెరుగైన పిచ్ రెడీ చేయాల్సింది' అని అక్తర్ చెప్పాడు.
'అలాగే బ్యాటింగ్లో కూడా టీమిండియా చాలా మెత్తబడిపోయి ఆడింది. అలా కాకుండా ఎప్పట్లా ఎటాకింగ్ ఆట ఆడాల్సింది. పిచ్ నుంచి మరికొంత పేస్, బౌన్స్ లభిస్తే.. అసలు టాస్ పెద్దగా ప్రభావమే చూపించేది కాదు. దురదృష్టం ఏంటంటే.. భారత్ ఎప్పుడూ ఇలాంటి పెద్ద మ్యాచుల్లో తడబడుతుంది.' అని అక్తర్ పేర్కొన్నాడు.