World Cup Final: క్రికెట్ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మొదలైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని కమిన్స్ తెలిపాడు. ఇక్కడి పిచ్ చూసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను చెప్పాడు.
'ఇది డ్రై పిచ్లా కనిపిస్తోంది. అందుకే ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాం. మంచు ప్రభావం కూడా ఒక కారణమే. ఇక్కడ సాయంత్రం పూట బాగా మంచు పడుతుంది. మేం ఒక బృందంగా రాణిస్తున్నాం. అందుకు చాలా గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మాకు కొంత కఠినమైన ఆరంభం లభించింది. కానీ అప్పటి నుంచి ఒక్క అడుగు కూడా తడబడలేదు. మా టీంలో ఎలాంటి మార్పులు లేవు. సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నాం' అని కమిన్స్ వెల్లడించాడు.

'నేను టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ తీసుకునేవాడిని. ఇది చాలా పెద్ద గేమ్. కాబట్టి స్కోరుబోర్డుపై మంచి స్కోరు ఉంచడం కీలకం. ఈ మ్యాచ్ అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నా. క్రికెట్లో ఇంత కన్నా పెద్ద ఈవెంట్ ఉండదు కదా. మేం ప్రశాంతంగా ఉన్నాం. ఇది చాలా గొప్ప ఫీలింగ్. ఫైనల్లో జట్టుకు నాయకత్వం వహించడం అనేది పెద్ద కల నిజమైనట్లే. మేం కూడా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు' అని రోహిత్ చెప్పాడు.
ఈ పిచ్ నుంచి స్పిన్నర్లకు కొంత సహకారం లభించే అవకాశం ఉండటంతో సిరాజ్ను పక్కన పెట్టి, ఈ మ్యాచ్లో అశ్విన్ను ఆడించాలని చాలా మంది నిపుణులు టీమిండియాకు సలహా ఇచ్చారు. కానీ తమ జట్టుపైనే రోహిత్ నమ్మకం ఉంచాడు. ఇప్పటి వరకు గెలుస్తూ వచ్చిన జట్టుతోనే బరిలో దిగాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా టీం: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్