INDvsAUS: వరల్డ్ కప్లో అద్భుతమైన ఫామ్లో చెలరేగుతున్న భారత జట్టు వరుస విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చింది. ఎప్పుడూ నాకౌట్స్లో కివీస్ను ఓడించని భారత్.. ఈసారి మొదటి సెమీఫైనల్లో న్యూజిల్యాండ్ను 70 పరుగుల తేడాతో చిత్తు చేసి మరీ ఫైనల్లో అడుగు పెట్టింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచులో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సౌతాఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఆసీస్.. ఈ మ్యాచులో కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఫైనల్లో టీమిండియానే ఫేవరెట్గా బరిలో దిగుతుందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు.

ఇప్పటి వరకు ఈ మెగాటోర్నీలో భారత్ ఎంత అద్భుతంగా ఆడిందో రవిశాస్త్రి వివరించాడు. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా లీగ్ దశను ముగించడం అంత ఈజీ కాదన్నాడు. అలాగే కివీస్ వంటి బలమైన టీంను సెమీస్లో 70 పరుగుల తేడాతో ఓడించిన విషయం మర్చిపోకూడదన్నాడు.
'ఇండియా ఈ వరల్డ్ కప్ గెలవడం ఖాయం. ఈ ఫైనల్ మ్యాచులో కూడా వాళ్లే ఫేవరెట్గా బరిలో దిగుతున్నారు. ఇప్పటి వరకు ఈ టీం అత్యద్భుతంగా ఆడింది. ఇప్పుడు ప్లేయర్లు అందరూ చాలా రిలాక్స్డ్గా ఉండి ఉంటారని అనుకుంటున్నా. ఈ టీంకు మంచి అనుభవం కూడా ఉంది' అని చెప్పాడు.
'స్వదేశంలో ఆడుతున్నారు. మంచి అనుభవం ఉంది. దానికితోడు ఈ ఫైనల్లో కొత్తగా వాళ్లేం చేయనక్కర్లేదు. ఇప్పటి వరకు ఎంత అద్భుతంగా ఆడారో.. అలాగే ఆడితే చాలు. చివరి గేమ్ ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచి మళ్లీ ఆట మొదలవుతుంది అంతే. ఆ కప్పు అందుకునేదీ ఈ టీమే' అని రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. ముఖ్యంగా ఈ టీం ఎవరో ఒకరిద్దరు ప్లేయర్లపై ఆధార పడటం లేదని, అందరూ కలిసి కట్టుగా రానిస్తున్నారని మెచ్చుకున్నాడు.