వన్డే వరల్డ్ కప్ మరోసారి టీమిండియా చేజారింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్లో టీమిండియానే ట్రోఫీ ముద్దాడుతుందని అంతా అనుకున్నారు. కానీ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ తడబడింది. బ్యాటింగ్ విభాగం తడబాటుతో బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. చివరకు కంగారూల చేతిలో ఓడి వరల్డ్ కప్ చేజార్చుకుంది.
ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన భారత జట్టుకు అనుకున్న ఆరంభం దక్కలేదు. శుభ్మన్ గిల్ (4) ఫెయిలయ్యాడు. అయితే రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లీ (54) ఇన్నింగ్స్ నిలబెట్టారు. అయితే అనవసర షాట్కు ప్రయత్నించిన రోహిత్ కూడా ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ (4) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో కోహ్లీ, కేఎల్ రాహుల్ (66) ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు.

ఇక కోహ్లీ అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ తేలిపోయింది. జడేజా (9), సూర్యకుమార్ యాదవ్ (18) ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ను భారత పేసర్లు కొంత కట్టడి చేశారు. డేవిడ్ వార్నర్ (7), మిచెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4)ను త్వరగానే పెవిలియన్ చేర్చారు.
కానీ ట్రావిస్ హెడ్ (137), మార్నస్ లబుషేన్ (58 నాటౌట్) మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో మంచు ప్రభావం కూడా పెరగడంతో భారత బౌలర్లు తడబడ్డారు. ముఖ్యంగా స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్ తేలిపోయారు 1979 తరవాత భారత స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇదే తొలిసారి.
ఈ క్రమంలో అభిమానులు కొందరు ఆటగాళ్లను నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో వాళ్ల దాడికి భయపడిన కాన్పూర్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలీసులను అక్కడ కాపలా పెట్టారు. ఎవరైనా ఆ ఇంటిపై దాడి చేస్తారేమో? అనే అనుమానంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచులో భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని.. ఆసీస్ జట్టు కేవలం 43 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన సంగతి తెలిసిందే. ఇది ఆసీస్కు ఆరో వన్డే వరల్డ్ కప్ కావడం గమనార్హం.