వన్డే వరల్డ్ కప్ మరోసారి టీమిండియా చేజారింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్లో టీమిండియానే ట్రోఫీ ముద్దాడుతుందని అంతా అనుకున్నారు. కానీ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ తడబడింది. బ్యాటింగ్ విభాగం తడబాటుతో బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. చివరకు కంగారూల చేతిలో ఓడి వరల్డ్ కప్ చేజార్చుకుంది.
ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన భారత జట్టుకు అనుకున్న ఆరంభం దక్కలేదు. శుభ్మన్ గిల్ (4) ఫెయిలయ్యాడు. అయితే రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లీ (54) ఇన్నింగ్స్ నిలబెట్టారు. అయితే అనవసర షాట్కు ప్రయత్నించిన రోహిత్ కూడా ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ (4) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో కోహ్లీ, కేఎల్ రాహుల్ (66) ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు.

ఇక కోహ్లీ అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ తేలిపోయింది. జడేజా (9), సూర్యకుమార్ యాదవ్ (18) ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ను భారత పేసర్లు కొంత కట్టడి చేశారు. డేవిడ్ వార్నర్ (7), మిచెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4)ను త్వరగానే పెవిలియన్ చేర్చారు.
కానీ ట్రావిస్ హెడ్ (137), మార్నస్ లబుషేన్ (58 నాటౌట్) మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో మంచు ప్రభావం కూడా పెరగడంతో భారత బౌలర్లు తడబడ్డారు. దీంతో ఆసీస్ జట్టు కేవలం 43 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ పరాజయంతో టీమిండియా ఆటగాళ్లు చాలా బాధలో కూరుకుపోయారు.
మైదానంలోనే రాహుల్, సిరాజ్ వంటి ప్లేయర్లు కన్నీళ్లు పెట్టుకోగా.. కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్లకు కూడా కళ్లలో నీళ్లు తిరిగాయి. అయితే వీళ్లందర్నీ ఓదార్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా టీమిండియా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ తదితరులను కౌగిలించుకొని ఓదార్చారు. ఇదే విషయాన్ని నెట్టింట పంచుకున్న జడేజా.. అభిమానుల మద్దతుతోనే తాము ఇంత దూరం వచ్చామని అన్నాడు.
ప్రధాని తమ డ్రెస్సింగ్ రూంకు వచ్చి ఓదార్చడం తమకు చాలా గొప్ప మోటివేషన్ అని చెప్పాడు. మహమ్మద్ షమీ కూడా నెట్టింట తన మనసులోని మాటను చెప్పుకున్నాడు. 'దురదృష్టవశాత్తూ నిన్న మా రోజు కాదు. ఈ టోర్నమెంట్ ఆసాంతం మాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా డ్రెస్సింగ్ రూంకు వచ్చి మా స్పిరిట్స్ పెంచినందుకు ప్రధాని మోదీకి చాలా రుణపడి ఉంటాం' అని ట్వీట్ చేశాడు.