World Cup Final: క్రికెట్ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మొదలైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని కమిన్స్ తెలిపాడు. ఇక్కడి పిచ్ చూసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను చెప్పాడు.
ఇది చూసిన ఫ్యాన్స్ వెంటనే చరిత్ర తిరగేశారు. ఈ డెసిషన్ టీమిండియాకు కలిసొచ్చేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన రెండుసార్లు టాస్ ఓడింది. 1983లో టాస్ ఓడిన భారత జట్టు.. కపిల్ దేవ్ సారధ్యంలో అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. ఈ క్రమంలోనే ఆ మ్యాచ్ గెలిచి ట్రోఫీ ముద్దాడింది.

ఆ తర్వాత 2011లో టాస్ ఓడిన ధోనీ సేన ముందుగా బౌలింగ్ చేసింది. శ్రీలంక మంచి స్కోరు చేసినా కూడా టీమిండియా బ్యాటర్లు కీలక ఇన్నింగ్సులు ఆడటంతో భారత్ పుంజుకుంది. చివరకు మ్యాచ్ నెగ్గి వరల్డ్ కప్ అందుకుంది. ఇదే విషయాన్ని గుర్తుచేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు కూడా టీమిండియా టాస్ ఓడిందని, కాబట్టి మ్యాచ్ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు.
అంతేకాదు, 2003లో ఆస్ట్రేలియా, భారత్ జట్లే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచులో టాస్ గెలిచిన గంగూలీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్ భారీ స్కోరు చేసింది. కంగారూ బ్యాటర్లను అడ్డుకోవడంలో గంగూలీ సేన తడబడింది. దీంతో ఆ మ్యాచ్ ఓడింది.
ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ కనుక మంచి స్కోరు చేస్తే ఈ మ్యాచ్ కూడా గెలిచే అవకాశం ఉందని, తద్వారా ట్రోఫీ ముద్దాడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి అదే హిస్టరీ ఈసారి రిపీట్ అవుతుందా? లేక కొత్త చరిత్ర మొదలవుతుందా? అనేది చూడాలి.