వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడింది. టోర్నీ ఆసాంతం ఎదురు లేకుండా చెలరేగిన భారత జట్టు.. ఫైనల్లో తడబడింది. ఆస్ట్రేలియా పదునైన వ్యూహాల ముందు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఆసీస్ ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఆరోసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది.
స్వదేశంలో జరిగిన ఈ వరల్డ్ కప్ను భారత్ గెలుస్తుందని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చివర్లో టీమిండియా తడబాటుకు గురైంది. ఫైనల్లో కేవలం రోహిత్, కోహ్లీ, రాహుల్ మాత్రమే బ్యాటుతో రాణించారు. వీరిలో కూడా రాహుల్కు ఇతర బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం కూడా దక్కలేదు. దీంతో అతను చాలా నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది.

దీంతో భారత జట్టు కేవలం 240 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆచితూచి ఆడింది. మూడు వికెట్లు వెంట వెంటనే కోల్పోవడంతో ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ ఇద్దరూ కూడా టెస్టు తరహాలో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. క్రీజులో కుదురుకొని, మంచు ప్రభావంతో బంతి నేరుగా బ్యాటు మీదకు రావడం మొదలు పెట్టిన తర్వాత భారీ షాట్లు బాదారు.
ముఖ్యంగా ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగి, ఆసీస్ విజయతీరాలకు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. లబుషేన్ కూడా హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీ రోల్ వహించాడు. ఇలా ఆసీస్ గెలవడంతో వంద కోట్ల మంది భారతీయుల మనసులు బరువెక్కాయి. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియా వేదికగా భారత అభిమానులకు సారీ చెప్పాడు.

'నేను క్షమాపణలు చెప్తున్నా. ఈ మ్యాచ్ అద్భుతంగా జరిగింది. స్టేడియం వాతావరణం కూడా సూపర్గా ఉంది. ఇండియా ఈ ఈవెంట్ను అదరగొట్టింది. అందరికీ ధన్యవాదాలు' అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అలాగే తాము వందకోట్ల మందిని బాధ పెట్టామని, అందుకే సారీ చెప్తున్నానని అన్నాడు.