వరల్డ్ కప్ గెలవలేదని టీమిండియా ప్లేయర్లు అందరూ చాలా బాధలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ టోర్నీ టాప్ వికెట్ టేకర్గా ఉన్న మహమ్మద్ షమీకి మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
సరిగ్గా ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే షమీ తల్లి ఆస్పత్రి పాలయ్యారట. తనకు నెర్వస్గా ఉందని, జ్వరం వచ్చినట్లు ఉందని షమీ తల్లి ఆనుమ్ ఆరా చెప్పారట. సరిగ్గా మ్యాచ్ సమయంలోనే ఇలా జరగడం గమనార్హం. దీంతో అక్కడ ఉన్న బంధువులు వెంటనే ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

యూపీలోని అమ్రోహాలో షమీ కుటుంబం ఉంటుంది. ఇక్కడి ఆస్పత్రిలోనే ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత.. షమీ తల్లిని మరో పెద్ద ఆస్పత్రికి తరలించారని సమాచారం. 'జ్వరం, నెర్వస్నెస్ కారణంగా తనను ఆస్పత్రిలో చేర్పించాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉంది' అని షమీ కజిన్ డాక్టర్ ముంతాజ్ వెల్లడించారు.
ఈ ఏడాది వరల్డ్ కప్లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన మహమ్మద్ షమీ.. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఆడిన తొలి నాలుగు మ్యాచుల్లో ఆడని షమీ.. ఐదో మ్యాచులో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. న్యూజిల్యాండ్తో జరిగిన ఆ మ్యాచులో నాలుగు వికెట్లతో చెలరేగాడు.
అప్పటి నుంచి ఆడిన ప్రతి మ్యాచులోనూ వికెట్లు తీసుకున్న షమీ.. ఈ వరల్డ్ కప్లో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. మొత్తం 7 మ్యాచులు ఆడిన అతను 10.70 సగటు, 12.20 స్ట్రైక్ రేటుతో 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా కివీస్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో జట్టు కష్టాల్లో ఉండగా ఏకంగా 7 వికెట్లతో చెలరేగిన షమీ.. ఆ మ్యాచ్లో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
కానీ ఫైనల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో భారత బౌలర్లు అంత గా ప్రభావం చూపలేకపోయారు. దీంతో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (137), మార్నస్ లబుషేన్ (58 నాటౌట్) బ్యాటింగ్ చేయడం సులువైంది. దీంతో ఆసీస్ కేవలం 43 ఓవర్లలోనే భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.