పెర్త్: పెర్త్లో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లతో ఫోటోలు దిగాలని నిరీక్షించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రాక్టీస్ అనంతరం అభిమానులను పట్టించుకోకండా వారి తిరిగి హోటల్ గదులకు వెళ్లడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.
ఫిబ్రవరి 22(ఆదివారం)న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అభిమానులు ఇచ్చిన మద్దతుతో గెలిచిన టీమిండియా ఇలా నిర్లక్ష్యం చేయడం బాధగా ఉందని అభిమానులు వాపోయారు. మెల్బోర్న్ మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ ఇది మెల్ బోర్న్లా లేదు ముంబైలా ఉందన్న విషయం తెలిసిందే.
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్లో టీమిండియా 130 పరుగుల విజయంతో గెలుపొందింది. ఫిబ్రవరి 28(శనివారం)న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరగనున్న మ్యాచ్ కోసం పెర్త్లో టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది.

బుధవారం పెర్త్లో టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో కొంత మంది అభిమానులు చీర్ చేసేందుకు వచ్చారు. వరుస విజయాలతో దూసుకపోతున్న టీమిండియా ఆటగాళ్లతో ఫోటోలు దిగేందుకు వారు చాలా సేపు నిరీక్షించారు. కానీ క్రికెటర్లు వారిని నిర్లక్ష్యం చేయడంతో ఆటగాళ్ల ప్రవర్తనకు అభిమానులు కలత చెందారు.
ఈ విషయాన్ని ఓ అభిమాని టైమ్స్ నౌ టెలివిజన్ ద్వారా తన అసంతృప్తిని తెలియజేశారు. "మేము సుమారు 10 నుంచి 15 మంది వరకు టీమిండియా ఆటగాళ్ల ఫోటోలకు కోసం నిరీక్షించాం. ఫోటో దిగేందుకు కేవలం కొన్ని నిమిషాలు కేటాయించమని కోరాం. కానీ వారు మా అభ్యర్ధనను తిరస్కరించారు"ని తెలిపారు.
మరొక అభిమాని మాట్లాడుతూ టీమిండియాను కలిసేందుకు చాలా సేపు వేచి చూసానన్నారు. కానీ వారు మా అభ్యర్ధనను పట్టించుకోలేదని తెలిపాడు. పెర్త్లో మూడో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా... గంటలకొద్దీ నెట్స్లో చెమటోడ్చే విధానాన్ని పక్కనపెట్టింది.
కేవలం డమ్మీ క్యాచింగ్, ఫీల్డింగ్, వ్యాయామాలకే పరిమితమైంది. ఇదేమీ కొత్త విధానం కాకపోయినప్పటికీ ఈ సెషన్ ఆటగాళ్లలో పోరాట స్ఫూర్తిని కలిగించింది. 75 నిమిషాలపాటు సాగిన ఈ సెషన్ను అంతా సరదాగా ఎంజాయ్ చేశారు. ఈ ట్రైనింగ్ సెషన్లో డమ్మీ క్యాచింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ అమితంగా ఆకట్టుకున్నాయి.
టీమిండియా సహాయక కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో సాగింది. భారత ఆటగాళ్లు టెన్నిస్ బాల్తో క్యాచ్లు ప్రాక్టీస్ చేశారు. మ్యాచ్లో లభించే షార్ప్ చాన్స్లను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై దృష్టిపెట్టారు. బంగర్ టెన్నిస్ రాకెట్తో కొట్టిన బంతిని వరుసలో నిలబడ్డ నలుగురు ఫీల్డర్లు ఒక్కొక్కరుగా క్యాచ్లు అందుకున్నారు.
ఎంత ఎత్తులో వచ్చినా ఒడిసిపట్టేలా ప్రాక్టీస్ సాగింది. స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్నపుడు ఎడ్జ్ తీసుకుని రెప్పపాటులో దూసుకొచ్చే బంతుల విషయంలో అప్రమత్తంగా ఉండేందుకు ఈ సెషన్ ఉపయోగపడనుంది. సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ డమ్మీ క్యాచింగ్లో అత్యంత ప్రతిభ కనబరిచారు. ఆ తర్వాత ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు.