వరల్డ్ కప్ దగ్గర పడిన నేపథ్యంలో ఆటగాళ్లపై మీడియా ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీడియాలో వచ్చే కథనాలు, సోషల్ మీడియా చూసేకొద్దీ ఈ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా వరకు ఆటగాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఇలా ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో 2011 వరల్డ్ కప్ సమయంలో తాము ఏం చేశామో మాజీ లెజెండ్ యువరాజ్ సింగ్ చెప్పాడు.
2011 వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించిన యువరాజ్ సింగ్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచులో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ భారత్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు సౌతాఫ్రికా పైచేయి సాధించింది. దీంతో భారత జట్టుపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

మీడియాలో ఈ ఓటమిపై ప్రత్యేక కథనాలు వచ్చాయి. ఇదంతా చూసిన టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్.. టీం అందరికీ కీలక సలహా ఇచ్చాడట. ఆటగాళ్లు ఎవరూ టీవీ చూడొద్దని, వార్తలు చదవొద్దని సూచించాడట. ఈ విషయాన్ని గుర్తుచేసుకున్న యువీ.. దీని వల్ల జట్టుకు చాలా లాభం జరిగిందని చెప్పుకొచ్చాడు.
'సౌతాఫ్రికాపై మేం గెలిచే మ్యాచ్లో ఓడిపోయాం. దీన్ని మర్చిపోయి మళ్లీ ఆటపై ఫోకస్ పెట్టాలని అనుకున్నాం. కానీ ఆ టైంలో మీడియా రెచ్చిపోయింది. అప్పుడే సచిన్ అందరికీ ఒకటే మాట చెప్పాడు. ఎవరూ టీవీ చూడొద్దు, న్యూస్ పేపర్లు చదవడం మానేయండి, ఎయిర్పోర్టుల్లో బయటకు వెళ్లే సమయంలో హెడ్ఫోన్స్ పెట్టుకోండి, జస్ట్ వరల్డ్ కప్ మీద ఫోకస్ పెట్టండి అని చెప్పాడు' అని యువీ వెల్లడించాడు.
సచిన్ ఇచ్చిన ఈ సలహాకు టీం అంతా ఒప్పుకుందని, అలా చేయడం చాలా బాగా పనిచేసిందని చెప్పుకొచ్చాడీ మాజీ ఆల్రౌండర్. అలాగే ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. 'భారత్త సమస్య ఏంటంటే.. ప్రజలు కేవలం భారత్ గెలుస్తుందని అనుకుంటారు. కానీ ఇది పెద్ద వరల్డ్ కప్. దీనిలో చాలా మంచి టీమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కో మ్యాచ్పై చాలా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది' అని వివరించాడు.