క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పూర్తిగా జరిగేలా కనిపించడం లేదు. దీనికి భారత వాతావరణ శాఖ విడుదల చేసిన రిపోర్టే కారణం. ఈ రిపోర్ట్ చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మ్యాచ్ అంతరాయం లేకుండా జరిగేలా చూడాలని దేవుడికి ప్రార్థనలు కూడా చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 14 శనివారం అహ్మదాబాద్ వేదికగా దాయాదుల సమరం జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే భారత వాతావరణ శాఖ అందరికీ షాకిస్తూ మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఐఎండీ నివేదిక ప్రకారం.. శనివారం అహ్మదాబాద్లో 30-35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండొచ్చు. అలాగే ఈ ప్రాంతంలో వర్షం కూడా పడవచ్చు. ముఖ్యంగా మ్యాచ్ జరిగే సమయంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

కాగా.. వరల్డ్ కప్ 2023లో భారత్, పాకిస్తాన్ ఇప్పటివరకు చెరో రెండు మ్యాచ్లు ఆడడమే కాకుండా.. రెండింటిలోనూ విజయం సాధించి మంచి ఊపుమీదున్నాయి. అలాగే భారత జట్టు వన్డే ప్రపంచ కప్లో ఇప్పటివరకు పాకిస్తాన్పై ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 7 మ్యాచ్ల్లో 7 సార్లు విజయం సాధించింది. దీంతో ఈ రికార్డును కాపాడుకోవాలని టీమిండియా చూస్తోంది.
మరోపక్క ఈ మ్యాచ్లో ఎలాగైనా భారత్పై గెలిచి చరిత్రను తిరగరాయాలని పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతోంది. ఇదిలా ఉంటే ఆసియా కప్ సమయంలో కూడా భారత్, పాక్ మధ్య గ్రూప్ స్టేజ్లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రిజర్వ్ డేన ఆడాల్సి వచ్చింది.
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్/శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్తాన్ తుది జట్టు (అంచనా):
అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది, హరీస్ రౌఫ్.