శ్రీలంకతో జరిగిన హై ఇంటెన్సిటీ మ్యాచ్లో పాక్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అబ్దుల్లా షఫీక్, మహమ్మద్ రిజ్వాన్ సెంచరీలతో అదరగొట్టడంతో 345 పరుగుల భారీ టార్గెట్ను మరో 10 బంతులు మిగిలుండగానే పాకిస్తాన్ ఛేదించింది. దీంతో ఈ వరల్డ్ కప్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక కుశాల్ మెండిస్ (122), సదీర సమర విక్రమ (108) అద్భుత సెంచరీలకు తోడు పథుమ్ నిస్సాంక (51) హాఫ్ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఇక 345 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ మొదట్లో తడబడింది. ఇమామ్ ఉల్ హక్ (12), బాబర్ అజామ్ (10) ఇద్దరినీ అవుట్ చేసిన మధుశంక పాకిస్తాన్ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. కానీ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (113) సెంచరీ బాది జట్టును విజయం వైపు నడిపించాడు. అతనికి జత కలిసిన వికెట్ కీపర్ రిజ్వాన్ (131 నాటౌట్) కూడా రాణించాడు.
ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ మధ్యలో రిజ్వాన్ తొడకండరాలు పట్టేశాయి. ముందుకొచ్చి భారీ షాట్ ఆడటానికి కూడా అతను ఇబ్బంది పడ్డాడు. ఈ బాధను నొక్కిపెట్టి మరీ సెంచరీ బాదిన అతను.. చివరి వరకు నాటౌట్గా నిలిచి జట్టుకు అద్భుతమైన విజయాన్నందించాడు. అంతేకాదు.. ఈ గెలుపుతో వరల్డ్ కప్లో అత్యంత భారీ ఛేజ్ చేసిన జట్టుగా కూడా పాక్ రికార్డులకెక్కింది.
ఈ విజయంతో సంబరాలు చేసుకుంటున్న పాక్ ఫ్యాన్స్కు ఒక విషయం టెన్షన్ పెడుతోంది. రిజ్వాన్ సెంచరీ చేసినా అతను తొడ కండరాలు పట్టేసి బాధ పడ్డాడు కదా. దీంతో 14వ తేదీన భారత్తో తలపడే పాక్ జట్టులో అతను ఆడతాడా? లేదా? అని ఆలోచిస్తున్నారు. ఆ మ్యాచ్కు రిజ్వాన్ దూరమైతే పాక్ గెవలడం కష్టమే అని అంటున్నారు.
అయితే శ్రీలంకతో మ్యాచ్ పూర్తయిన తర్వాత తన గాయం గురించి రిజ్వాన్ జోకులు పేల్చడం గమనార్హం. తొడ కండరాల బాధ ఎలా ఉంది? అని అడిగితే.. ఒక్కోసారి అది నిజంగా నొప్పే, కానీ ఎక్కువ సార్లు జస్ట్ యాక్టింగ్ అంటూ రిజ్వాన్ చెప్పాడు. దీంతో రిజ్వాన్ చేసింది యాక్టింగ్ అని తెలిసిన ఫ్యాన్స్.. వీడికి ఆస్కార్ ఇవ్వాల్సిందే అంటూ జోక్ చేస్తున్నారు.