కివీస్తో కీలక పోరుకు ముందు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో బౌలింగ్ చేయడానికి వచ్చిన అతను.. బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కింద పడ్డాడు. అప్పుడే అతని కాలికి గాయమైంది. ఆ తర్వాత బౌలింగ్ చేయడం కష్టంగా ఉండటంతో పాండ్యా మైదానం వీడాల్సి వచ్చింది.
తాాజగా అతని గాయంపై అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ.. పాండ్యాకు విశ్రాంతి అవసరమని, అందుకే కివీస్తో మ్యాచులో అతను ఆడటం లేదని పేర్కొంది. ఆ తర్వాత ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్కు మాత్రం పాండ్యా అందుబాటులో ఉంటాడని తెలిపింది. పాండ్యా లేకపోవడం టీమిండియాకు పెద్ద సమస్యలా మారింది. ముఖ్యంగా బలమైన కివీస్ను ఎదుర్కొనే సమయంలో పాండ్యా లేకపోవడం నిజంగా దురదృష్టమనే చెప్పాలి.

దీంతో పాండ్యా స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలని ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనిపై మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. 'నేను కనుక టీమిండియాలో భాగమై ఉంటే.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లలో ఒకరిని తీసుకుంటా. ఎందుకంటే కివీస్ను ఎదుర్కోవడానికి భారత్ వద్ద ఆ మాత్రం బ్యాటింగ్ డెప్త్ అవసరం' అని చెప్పాడీ మాజీ లెజెండ్.
'కివీస్తో ఆడేటప్పుడు టీమిండియాకు అతిపెద్ద సమస్య.. న్యూజిల్యాండ్ బౌలింగ్. కొత్త బంతితో కివీస్ బౌలర్లు చెలరేగుతారు. దీంతో భారత టాపార్డర్ తడబడుతుంది. ఇలాంటి సమయంలో జట్టును ఆదుకునేందుకు బ్యాటింగ్ డెప్త్ అవసరం' అని తేల్చిచెప్పాడు. అదే సమయంలో పాండ్యా స్థానంలో అశ్విన్ను తీసుకోవచ్చనే వాదనను కొట్టిపారేశాడు. పాండ్యా లేని లోటును తీర్చడం అశ్విన్ వల్ల కాదన్నాడు.

'పాండ్యా ప్లేస్లో అశ్విన్ను తీసుకుంటే.. అది భారత బ్యాటింగ్ను బలహీనంగా చేస్తుంది. అందుకే ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్.. వీళ్లిద్దరిలోనే ఒకరిని తీసుకోవాలి. అయితే పిచ్ను బట్టి అశ్విన్ను జట్టులకి తీసుకున్నా మంచిదే. ఎందుకంటే కివీస్ టీంలో ఎడం చేతి వాటం బ్యాటర్లు ఎక్కువ. పిచ్ పేసర్లకు అనుకూలించినా కూడా బౌలింగ్ చేయడానికి అశ్విన్ ఇష్టపడతాడు. అలాగే చివర్లో బ్యాటుతోనూ ఆకట్టుకోగలడు' అని సూచించాడు.