ఈ వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో ఉన్న టీమ్స్ ఏవైనా ఉంటే అవి భారత్, న్యూజిల్యాండ్ అని చెప్పాలి. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న ఈ రెండు జట్లు ధర్మశాల వేదికగా తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రెండు టీమ్స్ కూడా చెరో 8 పాయింట్లతో ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ విషయంలో కొద్దిగా మెరుగైన స్థితిలో ఉన్న న్యూజిల్యాండ్.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో నిలిచింది.
ఇప్పుడు ఈ రెండు జట్లు తలపడితే.. ఓడిన జట్టుకు ఈ మెగాటోర్నీలో ఇదే తొలి ఓటమి అవుతుందన్నమాట. అందుకే ఫ్యాన్స్ అంతా చాలా ఆత్రుతగా ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తుందా? అని టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్.. వర్షం వల్ల చాలా ఆలస్యంగా మొదలైంది.

అయితే ధర్మశాలలో ఆదివారం నాడు ఆకాశం అంతా మేఘావృతమై ఉంటుందని నిపుణులు తెలిపారు. ఇక్కడ అత్యధికంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందట. అలాగే వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, కేవలం 14 శాతమే వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా. అంటే ఫ్యాన్స్ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి మ్యాచ్ చూడొచ్చన్నమాట. ఇక ఇక్కడి పిచ్ అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది.
ఈ పిచ్ నుంచి లభించే ఎక్స్ట్రా బౌన్స్ను పేసర్లు కూడా తెగ ఇష్టపడతారు. వరల్డ్ కప్లో ఇప్పటి వరకు ఇక్కడ రెండు మ్యాచులు జరిగాయి. ఈ రెండింట్లో కూడా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. అయితే ఛేజింగ్ చేసే టీంకు కొంత ఇబ్బందులు కూడా రావొచ్చు. ఎందుకంటే నెదర్లాండ్స్పై 246 పరుగులు ఛేదించలేక సౌతాఫ్రికా కేవలం 207 పరుగులకే ఆలౌట్ అయింది ఇక్కడే. కాబట్టి టాస్ గెలిచిన టీం కొంచెం తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది.