వరల్డ్ కప్లో ఫ్యాన్స్కు కొత్త అనుభూతులు, జ్ఞాపకాలు అందజేస్తామని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న భారత జట్టు ఇది ముగిసిన వెంటనే వరల్డ్ కప్లో తలపడుతుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా ఫేవరెట్గా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా వరల్డ్ కప్లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. 2011లో వరల్డ్ కప్ కో-హోస్ట్గా ఉన్న భారత్.. ఆ ట్రోఫీని ముద్దాడింది. ఇప్పుడు పూర్తిగా టోర్నీ అంతా భారత్లోనే జరుగుతున్న నేపథ్యంలో టీంపై ఫ్యాన్స్ అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

ఈ టోర్నీలో ఆడటంలో ఉన్న ఎగ్జయిట్మెంట్ గురించి మాట్లాడిన కోహ్లీ.. ఈసారి ఎలాగైనా ఫ్యాన్స్ కల నిజం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 'మాకు మద్దతుగా నిలిచే ఫ్యాన్స్ ప్యాషన్, ఏం జరిగినా తగ్గని వాళ్ల సపోర్ట్ మాలో ఈ వరల్డ్ కప్ గెలవాలనే పట్టుదలను మరింత పెంచుతున్నాయి' అని కోహ్లీ చెప్పాడు.
'గత వరల్డ్ కప్ విజయాలు.. ముఖ్యంగా 2011 విజయం మనందరి మనసులపై చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు మా ఫ్యాన్స్కు మరిన్ని కొత్త జ్ఞాపకాలు ఇవ్వాలని మేం అనుకుంటున్నాం. మా ఫ్యాన్స్ అందరి ఎమోషన్స్కు అద్దం పట్టే ఈ టోర్నీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఫ్యాన్స్ కలలు నిజం చేసేందుకు మేం మా శక్తికి మించి పోరాడుతాం' అని కోహ్లీ మాటిచ్చాడు.
మరో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా కూడా తమ టీంకు ఫ్యాన్స్ నుంచి దక్కుతున్న అభిమానం గురించి మాట్లాడాడు. వరల్డ్ కప్లో తమ ఫ్యాన్స్ గర్వించే ప్రదర్శనలు ఇస్తామని జడ్డూ కూడా హామీ ఇచ్చాడు. లక్షలాది మంది అభిమానులు మనకు మద్దతుగా ఉంటే, ఒక క్రికెటర్గా అంత కన్నా మోటివేటింగ్ క్షణం మరొకటి ఉండదని చెప్పుకొచ్చాడు.