టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అనగానే మైదానంలో చురుగ్గా కదలడం, ఎవరైనా ఏమైనా అంటే అంతకు రెండింతల ఎగ్రెషన్తో సమాధానం ఇవ్వడం గుర్తొస్తుంది. కానీ ఇదంతా గతమని, ప్రస్తుతం తన నుంచి ఇలాంటి ఎగ్రెషన్ ఆశించడం కరెక్ట్ కాదని కోహ్లీ అంటున్నాడు. తన కెరీర్లో నాలుగో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు రెడీ అయిన కోహ్లీ ఈ కామెంట్స్ చేశాడు.
మూడేళ్ల పాటు ఫామ్ లేమితో ఇబ్బందులు పడిన అతను మళ్లీ ఫామ్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ వరల్డ్ కప్లో భారత బ్యాటింగ్ లైనప్కు కోహ్లీ వెన్నెముకలా మారనున్నాడు. జట్టును కష్టకాలంలో ఆదుకోవాల్సిన బాధ్యత అతనిపైనే ఉంటుంది. అంతేకాదు, 2011లో వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో కూడా కోహ్లీ సభ్యుడు కావడం గమనార్హం.

ఆ టీం నుంచి ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్న భారత ప్లేయర్లు అశ్విన్, కోహ్లీ మాత్రమే కావడం విశేషం. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న కోహ్లీ 13 ఇన్నింగ్సుల్లో 55.63 సగటు, 112.91 స్ట్రైక్ రేటుతో 612 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. తాజాగా తన బ్యాడ్ ఫేజ్ గురించి చర్చించిన కోహ్లీ.. ఈ ఫేజ్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పాడు.
దీని వల్ల ఒక మనిషితా తాను మారినట్లు కోహ్లీ వెల్లడించాడు. 'గత రెండున్నరేళ్ల కాలం నాకు చాలా నేర్పించింది. అప్పట్లో చేసిన యాంగ్రీ సెలబ్రేషన్స్ ఇకపై నా నుంచి మీకు కనిపించవు. నాకు చాలా మంది సలహాలు ఇచ్చారు. నువ్వు అది తప్పు చేస్తున్నావు, ఇది సరిగా చేయడం లేదంటూ చెప్తూనే వచ్చారు' అని వివరించాడు.
అలాగే తను ఫామ్ కోల్పోవడం టెక్నిక్ లోపం కాదని, మానసిక పరిస్థితి వల్లనే అని చెప్పుకొచ్చాడు. 'నేను మంచి ఫామ్లో ఉండగా ఆడిన వీడియోలన్నీ చూశా. అప్పుడు ఎలాగైతే ఆడానో.. నా బ్యాడ్ ఫేజ్లోనూ అలాగే ఆడా. అక్కడ తేడా నా మనసులో ఉన్న ఆలోచనలే. దాన్ని నేను ఎవరితో పంచుకోలేకపోయా' అని కోహ్లీ పేర్కొన్నాడు.