వరల్డ్ కప్ తొలి మ్యాచ్ నుంచే అద్భుతమైన ఫామ్ కనబరిచిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఆస్ట్రేలియాపై 85 పరుగుల సూపర్ ఇన్నింగ్స్తో ఈ మెగాటోర్నీని కోహ్లీ ఆరంభించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై శతకాలతో ఆకట్టుకున్నాడు. అలాగే న్యూజిల్యాండ్తో మ్యాచులో జట్టు కష్టాల్లో ఉండగా 95 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు 2 సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ.. ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్గా ఉన్నాడు. దీంతో కివీస్తో జరిగే సెమీఫైనల్ మ్యాచులో కూడా అతను రాణిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచుల్లో కోహ్లీ రికార్డు ఏమాత్రం బాగలేదు.

టీ20 వరల్డ్ కప్ సెమీస్లో అద్భుతమైన రికార్డు ఉన్న కోహ్లీ.. తనకు బాగా అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్లో తడబడ్డాడు. ఇప్పటి వరకు మూడుసార్లు వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఆడిన అతను.. ఒక్కసారి కూడా కనీసం డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోవడం గమనార్హం. కోహ్లీ ఆడిన తొలి వరల్డ్ కప్లో అంటే 2011లో పాకిస్తాన్తో సెమీస్ జరిగింది.
ఆ మ్యాచులో కేవలం 9 పరుగులే చేసిన కోహ్లీ.. వాహబ్ రియాజ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాత 2015లో ఆసీస్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో 13 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఇక చివరగా తను ఆడిన 2019 వరల్డ్ కప్ సెమీస్లో కూడా ఒక్క పరుగు వద్దనే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.
ఈ మూడుసార్లు కూడా ఎడం చేతి వాటం పేసర్ల బౌలింగ్లోనే కోహ్లీ అవుటవడం గమనార్హం. ఇప్పుడు కూడా ట్రెంట్ బౌల్ట్నే కోహ్లీ ఎదుర్కోవాల్సి ఉంది. అంతేకాదు, మూడు సెమీస్ మ్యాచుల్లో కలిపి కోహ్లీ చేసింది కేవలం 11 పరుగులే. ఈ రికార్డును కూడా సరిచేయాల్సిన బాధ్యత కోహ్లీపై ఉంది. ఒకవేళ కోహ్లీ తడబడితే భారత బ్యాటింగ్ లైనప్ కూడా తడబడే అవకాశం ఉంది.
కాబట్టి కోహ్లీ పూర్తి పాజిటివ్గా బరిలో దిగాల్సి ఉంటుంది. గతాన్ని మర్చిపోయి తన మంచి ఫామ్ను కొనసాగించాలి. అప్పుడే టీమిండియా బ్యాటింగ్ విభాగం తడబడకుండా ముందుకు సాగుతుంది. ఎందుకంటే జట్టుకు రోహిత్ అద్భుతమైన ఆరంభాలు అందిస్తున్నా.. మిడిలార్డర్లో కోహ్లీ చుట్టూనే భారత బ్యాటింగ్ తిరుగుతోంది.