వరల్డ్ కప్ వల్ల తనతోపాటు టీంపై కూడా చాలా ఒత్తిడి ఉంటుందని టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. అదే సమయంలో కప్పు గెలవడం కోసం క్రికెటర్లు చాలా కష్టపడతారని ఫ్యాన్స్కు గుర్తుచేశాడు. మరికొన్ని రోజుల్లోనే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ మొదలవనుంది. ఈ క్రమంలోనే కోహ్లీ తన మనసులో మాట బయటపెట్టాడు.
2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ మళ్లీ ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదు. ఈ క్రమంలో టీమిండియాపై చాలా ఒత్తిడి పెరుగుతోంది. దీని గురించి తాజాగా కోహ్లీ మాట్లాడాడు. 'ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. టీం ఎలాగైనా కప్పు గెలవాలని ఫ్యాన్స్ ఎప్పుడూ అంటుంటారు. కానీ వాళ్ల కోరిక నా కన్నా బలమైంది కాదనే చెప్తా. అంటే నేను కరెక్ట్గానే ఉన్నట్లు కదా' అంటూ వరల్డ్ కప్ కొట్టాలనే తన కోరిక ఎంత బలమైందో వెల్లడించాడు.

'ఫ్యాన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్లు, ఎమోషన్లు కచ్చితంగా ఉంటాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి.. ప్లేయర్లు గెలవాలని కోరుకున్నంతగా ఎవరూ కోరుకోరు' అని చెప్పాడు. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ నెగ్గిన భారత్.. ఆ తర్వాత వరల్డ్ కప్లలో కూడా తడబడుతూనే వచ్చింది. ఈ క్రమంలో 2023 వరల్డ్ కప్ను ఒక ఛాలెంజ్గా కోహ్లీ స్వీకరించాడు. ఇలాంటి కొత్త అనుభవాల వల్ల తన ఆట మరోస్థాయికి చేరుతుందన్నాడు.
వల్డ్ కప్స్లో కోహ్లీ రికార్డు అంత గొప్పగా లేదని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఈ టోర్నీల్లో కోహ్లీ 46.81 సగటుతో వెయ్యిపైగా పరుగులు చేశాడు. వీటిలో రెండు శతకాలు కూడా ఉండటం గమనార్హం. 'మన ముందు ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా సరే.. దాన్ని ఎదుర్కోవాలనే అనుకుంటాం. మీ ముందుకు కష్టం వస్తే ఎగ్జయిట్ అవ్వండి. దాన్నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయొద్దు' అని కోహ్లీ చెప్పాడు.
'పదిహేనేళ్ల తర్వాత కూడా నాకు ఇలా ఛాలెంజ్లు ఎదుర్కోవడం ఇష్టమే. ఈ వరల్డ్ కప్ కూడా నాకు ఒక ఛాలెంజ్. ఇది నన్ను చాలా ఎగ్జయిట్ చేస్తుంది. నన్ను నేను మరో స్థాయికి తీసుకెళ్లడానికి.. నాకు ఇలాంటి ఏదో ఒక కొత్త సవాల్ కావాలి' అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి అద్భుతమైన ఫామ్లో ఉన్న కోహ్లీ.. వరల్డ్ కప్లో కూడా టీమిండియాకు చాలా కీలకం కానున్నాడని నిపుణుల అభిప్రాయం.