బంగ్లాదేశ్తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. చివరి వరకు నాటౌట్గా నిలిచి సిక్స్తో జట్టుకు విజయాన్నందించాడు. అయితే ఈ సెంచరీతో కోహ్లీ తన కెరీర్లో కొన్ని అరుదైన మైలురాళ్లను చేరుకున్నాడు.
బంగ్లాదేశ్పై టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. 257 పరుగుల టార్గెట్ను మరో 51 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో ఛేదించింది. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ (48), శుభ్మన్ గిల్ (53) మెరిశారు. ఆ తర్వాత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (103*) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలోనే తన కెరీర్లో 5 రికార్డులను అందుకున్నాడు.

ఈ మ్యాచ్లో కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇది కోహ్లీ వన్డే కెరీర్లో 40వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. అలాగే ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో 11వది. ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో ఇన్నిసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న బ్యాటర్ల లిస్ట్లో క్రిస్ గేల్ (11) టాప్లో ఉన్నాడు. బంగ్లాతో మ్యాచ్తో కోహ్లీ కూడా గేల్ సరసన చేరాడు. అయితే భారత్ తరపున మాత్రం ఈ రికార్డ్ సాధించిన ఏకైక బ్యాటర్ కోహ్లీనే.
బంగ్లాతో మ్యాచ్కు ముందు కోహ్లీ తన కెరీర్లో 26,000 పరుగులకు 76 రన్స్ దూరంలో ఉన్నాడు. అయితే ఇన్నింగ్స్ 39వ ఓవర్లో 82 బంతుల్లో అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్గా మహేలా జయవర్దనే (25,957) ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (34,357), కుమార్ సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483) ఈ ఘనత సాధించారు. ఇక అత్యంత వేగంగా కేవలం 567 ఇన్నింగ్స్ల్లోనే ఈ రికార్డు అందుకున్న ఏకైక బ్యాటర్గా మరో రికార్డ్ను తన పేరిట లిఖించుకున్నాడు.
దీంతో పాటు వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా రికార్డు సాధించాడు. చివరిగా ఐసీసీ వైట్ బాల్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గానూ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 67 ఐసీసీ మెన్స్ టోర్నీ మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. 67.25 సగటుతో 2,959 పరుగులు చేశాడు. అయితే ఇంతకుముందు ఈ రికార్డ్ క్రిస్ గేల్ (82 ఇన్నింగ్స్ - 2,942) పేరున ఉండేది.