Worldcup 2023: బంగ్లాదేశ్పై విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత వరల్డ్ కప్లో కోహ్లీ సెంచరీ చేశాడని మురిసిపోతున్నారు. కానీ ఇలా కోహ్లీ సెంచరీ చేయడానికి అంపైర్ రిచర్డ్ కెటిల్బరో కూడా హెల్ప్ చేశాడని కొందరు మర్చిపోతున్నారు. అయితే చాలా మంది ఫ్యాన్స్ మాత్రం కెటిల్బరోపై కూడా జోకులు వేస్తున్నారు.
అతను కూడా కోహ్లీ సెంచరీకి సాయం చేశాడని అంటున్నారు. అసలు ఎందుకిలా అంటున్నారంటే.. కోహ్లీ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా, 42వ ఓవర్ వేయడానికి బంగ్లా బౌలర్ నాసుమ్ అహ్మద్ వచ్చాడు. వచ్చీరావడంతోనే అతను కోహ్లీ లెగ్సైడ్ బంతిని వేశాడు. కోహ్లీ కొంచెం అలా పక్కకు తప్పుకోగానే అది అతని కాళ్ల వెనుక నుంచి కీపర్ చేతుల్లో పడింది.

ఇలా కావాలని నాసుమ్ వైడ్ డెలివరీ వేయడం చూసిన కోహ్లీ చికాకు పడిపోయాడు. ఆశ్చర్యంగా, చిరాకుగా బౌలర్ వైపు చూశాడు. అయితే నాసుమ్, బంగ్లా టీం, చివరకు టీమిండియా సభ్యులను కూడా అంతకన్నా ఆశ్చర్యంలో ముంచేశాడు అంపైర్ రిచర్డ్ కెటిల్బరో. ఎందుకంటే అతను దాన్ని వైడ్గా ప్రకటించలేదు. కోహ్లీ కూడా ఈ నిర్ణయం చూసి షాకయ్యాడు.
గడ్డం గీక్కుంటూ ఆలోచిస్తున్నట్లు కెటిల్బరో కనిపించాడు. ఆ తర్వాత మూడో బంతికే భారీ సిక్సర్ బాదిన కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కెటిల్బరో ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్న ఫ్యాన్స్.. 'అసలు కోహ్లీ సెంచరీకి కారణం అంపైర్ అతనికి మెడల్ ఇవ్వాలి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గడ్డం గీక్కుంటున్న కెటిల్ బరో ఫొటోను పెట్టి 'ఏం యాక్టింగ్ చేస్తున్నావ్ రా?' అంటూ జోక్స్ చేస్తున్నారు.
నాసుమ్ కావాలని వేసిన ఈ వైడ్ను అంపైర్ కనుక పరిగణనలోకి తీసుకొని ఉంటే.. కోహ్లీపై మరింత ఒత్తిడి పెరిగేది. అప్పుడు అతని సెంచరీ పూర్తవడం కూడా చాలా కష్టంగా మారేది. అయితే అది మాత్రం కచ్చితంగా వైడ్ అని చాలా మంది అంటున్నారు. అంపైర్ దాన్ని వైడ్ అని ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదన్నారు. మరి కెటిల్బరో కూడా కోహ్లీ సెంచరీ చూడాలని అనుకున్నాడేమో?