వన్డే వరల్డ్ కప్కు సమయం దగ్గర పడింది. ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ మెగా టోర్నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ట్రోఫీని వివిధ దేశాల్లో తిప్పడం జరిగింది. ఇలా ప్రపంచం చుట్టి వచ్చిన వరల్డ్ కప్ ట్రోఫీ మళ్లీ భారత్లో అడుగు పెట్టింది. ఇక్కడ వరల్డ్ కప్ మ్యాచులు జరిగే నగరాల్లో దీన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ ట్రోఫీని చెన్నైకి తీసుకొచ్చారు.
ఇక్కడ ఈ ట్రోఫీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. వరల్డ్ కప్ ట్రోఫీతో ఆయన కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ ఈసారి వరల్డ్ కప్ను భారత్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి వరల్డ్ కప్ టోర్నమెంట్ మొత్తం కేవలం భారత్లోనే జరుగుతోంది. ఇలా జరగడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

ఇంతకుముందు వరల్డ్ కప్ ఆతిథ్య బాధ్యతలను భారత్ ఇతర దేశాలతో పంచుకుంది. కానీ ఈసారి పూర్తిగా దేశంలోనే ఈ టోర్నీ ఆసాంతం జరగనుంది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ మొదలవుతుంది. గుజరాత్లోని నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ జరుగుతుంది. చివరి వరల్డ్ కప్ ఫైనలిస్టులు అయిన ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ మధ్య మ్యాచుతోనే మెగా టోర్నీ మొదలవుతుంది.
ఇక భారత జట్టు తమ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. అక్టోబర్ 8న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అలాగే క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే భారత్, పాక్ మ్యాచ్.. అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఇప్పటికే వరల్డ్ కప్లో భారత్ ఆడే మ్యాచుల టికెట్లన్నీ అమ్ముడుపోవడం గమనార్హం.