ఐసీసీ వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లీష్ పేసర్ రీసీ టాప్లే దెబ్బకు బంగ్లా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (1)తో పాటు తంజిద్ హసన్ (1), నజ్ముల్ హొస్సైన్ షాంటో (0)లను వెంట వెంటనే అవుట్ చేసి బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో మ్యాచ్పై ఇంగ్లండ్కు పూర్తిస్థాయి పట్టు లభించింది.
365 పరుగులు భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాకు టాప్లే చుక్కలు చూపించాడు. తన పదునైన బంతులతో బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించాడు. తొలి ఓవర్లోనే తంజిద్ (1), షాంటో (0)లను పెవిలియన్ చేర్చి బంగ్లాకు షాకిచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (1)ను కూడా అవుట్ చేసి బంగ్లా గెలుపు ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా కేవలం 3 ఓవర్లలోనే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ను తలకిందులు చేశాడు.

కొద్ది సేపటికే మరో ఇంగ్లీష్ బౌలర్ క్రిస్ వోక్స్ కూడా మెహెదీ హసన్ మిరాజ్ (8)ని అవుట్ చేసి ఖాతా తెరిచాడు. దీంతో 9 ఓవర్లు పూర్తయ్యే సమయానికి బంగ్లా 4 వికెట్లు కోల్పోయి కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అంతకుముందు ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్ 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్లతో ఏకంగా 140 పరుగులు చేసి బంగ్లా బౌలింగ్ను ఊచకోత కోశాడు. అతడికి తోడు జో రూట్ కూడా 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 82 పరుగులు చేసి ఇంగ్లండ్ను పటిష్ఠమైన స్థితికి చేర్చాడు.
ఫలితంగా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా ఇంగ్లీష్ టీం భారీ స్కోరు చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్ 4 వికెట్లు, షొరీఫుల్ ఇస్లాం 3 వికెట్లు తీయగా, టస్కిన్ అహ్మద్, షకీబ్ అల్ హసన్లకు చెరో వికెట్ దక్కింది.