వన్డే వరల్డ్ కప్కు రోజులు దగ్గర పడ్డాయి. దీంతో ఈ మెగా టోర్నీ టికెట్ల అమ్మకంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టికెట్లు కావాలనుకునే వాళ్లు తమ వెబ్ సైటులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 15 మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
అక్టోబర్ 5 నుంచి నవంరు 19 వరకు భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులు జరిగే వేదికలను ఇటీవలే బీసీసీఐ బృందం పరిశీలించింది. ఏర్పాట్లు అన్నీ సంతృప్తి కరంగా ఉన్నాయని భావించిన అనంతరం టికెట్ల అమ్మకం మొదలు పెడతామని కొన్నిరోజుల క్రితమే బీసీసీఐ తెలిపింది.

ఈ నేపథ్యంలోనే టికెట్ల అమ్మకం ప్రక్రియపై ఫోకస్ పెట్టింది. ఈ టికెట్లు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు www.cricketworldcup.com/register వెబ్ సైటులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ఈ నెల 25 నుంచి టికెట్లు కొనుగోలు చేసే వీలుంటుంది.
ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచులకు సంబంధించి ఈ నెల 25, 30, 31తోపాటు సెప్టెంబరు 1, 2, 3, తేదీల్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవలే ఐసీసీలోని మూడు సభ్య దేశ బోర్డులు వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పులు కావాలని కోరాయని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వరల్డ్ కప్ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ కొత్త షెడ్యూల్ను ఇటీవలే బీసీసీఐ, ఐసీసీ మరోసారి ప్రకటించాయి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ మరో రోజు ముందుగానే జరగనుంది. అక్టోబర్ 14న ఈ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.