భారత్లో చివరగా వన్డే వరల్డ్ కప్ జరిగినప్పుడు టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో ట్రోఫీ నెగ్గింది. ఆ టోర్నీలో యువరాజ్ సింగ్ ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేరు. రక్తం కక్కుతూ కూడా అతను దేశం కోసం ఆడాడు. 2011 వరల్డ్ కప్ నెగ్గడంలో యువీ పాత్ర ఎంత కీలకమైందో ఆ టోర్నీ చూసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ప్రస్తుతం భారత జట్టులో అలాంటి ప్లేయర్ లేడు.
ఈ క్రమంలోనే ఈసారి యువీ పాత్రను పోషించగలిగే ప్లేయర్లు ఎవరు? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనికి మాజీ సెలెక్టర్, టీమిండియా లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్ బదులిచ్చాడు. జట్టులో యువీ వంటి ఆల్రౌండర్లు చాలా కీలకం అని నొక్కి చెప్పిన శ్రీకాంత్.. ముఖ్యంగా భారత్లో పిచ్ల గురించి కూడా తన అభిప్రాయం చెప్పాడు. ఈ క్రమంలో 2011 వరల్డ్ కప్ టీం గురించి కూడా ప్రస్తావించాడు.

'భారత్లో కొన్ని వికెట్లు బాగా టర్న్ ఇస్తాయి. ఆస్ట్రేలియాలో ఉన్నంత బౌన్స్ ఇక్కడ ఉండదు. ఇంగ్లండ్లో దొరికే మూవ్మెంట్ కూడా ఉండదు. ఈ పరిస్థితులకు భారత జట్టు అలవాటు పడిపోయింది. అదే ఈ జట్టుకు పెద్ద అడ్వాంటేజ్. ఇక 2011 వరల్డ్ కప్లో చాలా మంది ఆల్రౌండర్లను చూశాం. ధోనీ సమర్ధవంతమైన నాయకత్వంలో అద్భుతమైన టీం ఆడింది' అని శ్రీకాంత్ అన్నాడు.

'ఆ సమయంలో మనకు యువరాజ్ సింగ్ ఉన్నాడు. ఇప్పుడు ఆ పాత్రను రవీంద్ర జడేజా ఫుల్ఫిల్ చేస్తాడని అనుకుంటున్నా. 2011లో యువరాజ్ చేసిన ప్రదర్శననే జడేజా చేస్తాడని నా నమ్మకం. ఈసారి భారత్ కనుక వరల్డ్ కప్ గెలవాలంటే.. జడేజా, అక్షర్ పటేల్ వంటి వాళ్లే చాలా కీలకం అని గట్టిగా నమ్ముతున్నా' అని శ్రీకాంత్ అన్నాడు. మరి వీళ్లిద్దర్నీ రోహిత్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.