వన్డే వరల్డ్ కప్ కోసం కూడా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆసియా కప్ టీంలో పెద్దగా మార్పులు చేయకుండానే టీంను ఎంపిక చేశారు సెలెక్టర్లు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉంది. వరల్డ్ కప్ కోసం సెలెక్టర్లు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్లలో ఏడుగురు ప్లేయర్లు తొలిసారి వరల్డ్ కప్లో ఆడనున్నారు. వీళ్లకు వరల్డ్ కప్ ఆడిన అనుభవం ఏమాత్రం లేదు.
ఇక 2019లో వరల్డ్ కప్ టీంలో ఉన్న ఏడుగురు ప్లేయర్లు ఈసారి జట్టుకు దూరమయ్యారు. ఆ వరల్డ్ కప్లో మయాంక్ అగర్వాల్, దినేష్ కార్తీక్, విజయ్ శంకర్, యుజ్వేంద్ర చాహల్, శిఖర్ ధవన్, భువనేశ్వర్ కుమార్, రిషభ్ పంత్ ఉన్నారు. వీళ్లంతా రకరకాల కారణాల వల్ల జట్టుకు దూరమయ్యారు. అగర్వాల్, విజయ్ శంకర్, డీకే ఎప్పటి నుంచో జట్టుకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో వీళ్లు వన్డేలు క్రికెట్ ఆడింది కూడా చాలా తక్కువ.

ఇక పంత్ గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. భువనేశ్వర్, చాహల్ ఇద్దరూ ఫర్వాలేదన్నట్లు రాణిస్తున్నారు. కానీ సెలెక్టర్లు వీళ్లకు జట్టులో చోటివ్వలేదు. ఈ ఏడుగురి స్థానాలను శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ భర్తీ చేస్తున్నారు. వీళ్లకు ఇదే తొలి వరల్డ్ కప్ కావడం గమనార్హం.
మరి మొట్టమొదటిసారి ఈ మెగా టోర్నీ ఆడుతున్న వీళ్లందరూ ఏమాత్రం రాణిస్తారో చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో ఒక మ్యాచ్లో ఆసాంతం బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్లో పూర్తిగా బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో శార్దూల్, సిరాజ్, గిల్, కిషన్ ఫర్వాలేదనిపించారు. శ్రేయాస్ అయ్యర్ పెద్దగా రాణించలేదు. సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్కు ఆడే అవకాశం రాలేదు.
ఇక రోహిత్ శర్మ ఎలాగైనా ఈసారి వరల్డ్ కప్ నెగ్గాలని పట్టుదలగా ఉన్నాడు. గత వరల్డ్ కప్లో బ్యాటుతో రోహిత్ చెలరేగాడు. కానీ భారత్ మాత్రం ట్రోఫీ ముద్దాడలేకపోయింది. అందుకే ఈసారి మరింత పట్టుదలతో రోహిత్ బరిలో దిగుతున్నాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్లో వరుసగా నాలుగో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. అతను 2011 నుంచి వరుసగా వన్డే వరల్డ్ కప్లు ఆడుతూనే ఉన్న సంగతి తెలిసిందే.