క్రికెట్ లో ఓవర్ నైట్ స్టార్ అనే మాట చాలా సార్లు వినిపిస్తుంది. కొంతమంది ఆటగాళ్ళు ఒక్క ఇన్నింగ్స్ తో స్టార్ ప్లేయర్లు అయిపోతారు. న్యూజీలాండ్ కి చెందిన అల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా సరిగ్గా అలాగే ఇప్పుడు స్టార్ అయిపోయాడు. ఎంతలా అంటే అతడి కోసం ఇప్పుడు ఏకంగా 3 ఐపీఎల్ జట్లు పోటీ పడుతున్నాయి.
2023 ప్రపంచ కప్ తొలి మ్యాచ్ నిన్న గురువారం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 282 రన్స్ చేసింది. ఇక 283 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ విల్ యంగ్(0) రూపంలో తొలి వికెట్ వెంటనే కోల్పోయినా.. ఆ తర్వాత అద్భుతంగా ఆడింది. వన్ డౌన్ లో వచ్చిన రచిన్ రవీంద్ర మరో ఓపెనర్ డెవాన్ కాన్వాయ్ తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. ఏకంగా 273 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు అద్భుతమైన విజయాన్నందించాడు.

ఒకపక్క కాన్వాయ్ 121 బంతుల్లో 3 సిక్సులు, 19 ఫోర్లతో 152 రన్స్ బాదితే.. మరోపక్క రవీంద్ర 96 బంతుల్లో 5 సిక్సులు, 11 ఫోర్లతో 123 రన్స్ చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది మాత్రమే కాకుండా అటు బౌలింగ్ లోనూ రచిన్ 10 ఓవర్లు వేసి ఓ వికెట్ కూడా తీశాడు. ఫలితంగా 2023 వరల్డ్ కప్ తొలి మాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడమే కాకుండా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
నిజానికి రవీంద్ర పాకిస్థాన్ తో జరిగిన వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లోనే తన టాలెంట్ కి చిన్న శాంపిల్ ఇచ్చాడు. పటిష్ఠమైన పాక్ పేస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని 97 రన్స్ బాదాడు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ముఖ్యంగా ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు రచిన్ రవీంద్ర కోసం క్యూ కడుతున్నాయి.
ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈ లిస్ట్ లో ముందున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఎప్పటిలానే మెరుగైన ఆటగాళ్లను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్ళు గుజరాత్ లో ఉన్నారు. ఒకవేళ రవీంద్ర కూడా గుజరాత్ లో చేరితే అప్పుడు ఆ జట్టు మరింత పటిష్ఠంగా మారుతుందనడంలో సందేహం లేదు.

ఇక గత ఏడాది అత్యంత దారుణ ప్రదర్శనతో నిరాశ పరిచిన ఢిల్లీ.. ఈ ఏడాదైనా ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లను సొంతం చేసుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటోంది. అందుకే రవీంద్రని సొంతం చేసుకోవాలని బలంగా ప్రయత్నిస్తోంది.
ఈ రెండు జట్లే కాకుండా రాజస్థాన్ రాయల్స్ కూడా రవీంద్రని సొంతం చేసుకోవడానికి రెడీ అవుతోంది. సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ జట్టూ ఐపీఎల్ లోని బలమైన జట్లలో ఒకటిగా మారింది. అయితే ఇప్పటికీ ఆ జట్టులో సరైన ఆల్ రౌండర్ లేకపోవడం తీరని లోటే. అందుకే ఆ లోటును రవీంద్రతో తీర్చుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది.
మరి చూడాలి 2024 ఐపీఎల్ లో రవీంద్రని ఏ టీమ్ సొంతం చేసుకుంటుందో. ఇక ఫ్యాన్స్ కూడా రవీంద్ర లాంటి ఆల్ రౌండర్ ఐపీఎల్ లో ఆడితే చూడాలని ఎంతో ఆశపడుతున్నారు.