భారత్, పాక్ మ్యాచ్ అంటే కేవలం భారీ ఇన్నింగ్సులు, సెంచరీలే కాదు. అభిమానుల ఉత్సాహంపై చటుక్కున నీళ్లు కుమ్మరించే వికెట్లు, నిప్పులు చెరిగే డెలివరీలు కూడా ఉంటాయి. మరి ఆ బంతులు వేసే బౌలర్లు సాధారణంగా ఉంటారా? బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించరూ? మరి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచులో ఇలా బ్యాటర్లను వణికించి, ఎక్కువ వికెట్లు తీసుకునే బౌలర్లు ఎవరో ఒకసారి చూద్దామా?
కుల్దీప్ యాదవ్: టీమిండియాలో రీఎంట్రీ తర్వాత కుల్దీప్ యాదవ్ చెలరేగుతున్నాడు. జట్టులో తనే ప్రధాన స్పిన్నర్గా ఎదిగాడు కూడా. పాక్పై వన్డేల్లో కుల్దీప్ రికార్డు చాలా అద్భుతంగా ఉంది. దాయాదులపై ఐదు మ్యాచులు ఆడిన అతను పది వికెట్లు తీసుకున్నాడు.

ఇటీవల ఆసియా కప్లో అయితే ఏకంగా ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. మంచి వేరియేషన్లతో బౌలింగ్ చేసే అతను.. అహ్మదాబాద్ పిచ్ నుంచి ఏమాత్రం సహకారం దొరికినా పాక్ను ముంచేస్తాడు.
షహీన్ అఫ్రిదీ: భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలిగే అతికొద్ది మంది బౌలర్లలో షహీన్ అఫ్రిదీ ఒకడు. ప్రస్తుతం హసన్ అలీ మంచి ఫామ్లో ఉన్నా కూడా.. టీమిండియాకు ఎప్పటి నుంచో ఎడం చేతి వాటం పేసర్లను ఎదుర్కోవడం సమస్యగానే ఉంది. కాబట్టి షహీన్ ఈ మ్యాచులో భారత్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

వరల్డ్ కప్లో చక్కగానే బౌలింగ్ చేసినా షహీన్ పెద్దగా వికెట్లు తీయలేదు. అయితే ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు కచ్చితంగా కొత్త బంతితో షహీన్ స్వింగ్కు బలవడం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే వీళ్లిద్దరూ అంత గొప్ప ఫామ్లో లేరు. దానికితోడు షహీన్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు.
జస్ప్రీత్ బుమ్రా: ఆఫ్ఘనిస్తాన్తో భారత్ ఆడిన మ్యాచులో బంతితో బుమ్రా చెలరేగాడు. ఫ్లాట్ పిచ్లపై వికెట్లు తీసుకోవడంలో బుమ్రా దిట్ట. అహ్మదాబాద్లో కూడా అతను అదే ట్యాలెంట్ చూపిస్తే ఈజీగా ఈ మ్యాచులో బుమ్రానే ఎక్కువ వికెట్లు తీసుకోవడం ఖాయం. ఇక డెత్ ఓవర్లలో బుమ్రా యార్కర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

వీటన్నిటికీ తోడు ప్రస్తుతం బుమ్రా మంచి ఫామ్లో ఉన్నాడు. అదే సమయంలో పాకిస్తాన్ టాపార్డర్ పరమ చెత్త ఫామ్లో ఉంది. ఇప్పుడు కనుక కొత్త బంతితో బుమ్రా చెలరేగితే పాకిస్తాన్ ముప్పుతిప్పలు పడాల్సి వస్తుంది.