ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్లో భారత్ అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో కేఎల్ రాహుల్ (97*)తో కలిసి విరాట్ కోహ్లీ (85) మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు.
స్లో వికెట్పై ఆచి తూచి పరుగులు రాబడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపాడు. 200 పరుగుల లక్ష్య ఛేదనలో రాహుల్తో కలిసి 165 పరుగుల సూపర్ పార్ట్నర్షిప్ నెలకొల్పి జట్టును విజయానికి చేరువ చేశాడు.

కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్పై అనేకమంది మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కూడా కోహ్లీ ఇన్నింగ్స్ను అద్భుతమంటూ అభినందించాడు. విరాట్ ఒత్తిడిని ఆస్వాదిస్తాడని, సులభంగా లభించే పరుగులంటే అతడికి పెద్దగా ఇష్టం ఉండదని అన్నాడు.
'ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆటగాడు చేసే ప్రతి పరుగూ విలువైనదే. అందుకే ప్రతి ఆటగాడూ ఒత్తిడిని భరించాలి, అదే సమయంలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడగలగాలి. ఆ గుణం కోహ్లీలో పుష్కలంగా ఉంది. అదే అతడిని ప్రపంచంలో మేటి బ్యాట్స్మన్ని చేసింది' అంటూ కోహ్లీని గవాస్కర్ ఆకాశానికెత్తేశాడు.

అయితే 85 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ కావడంపై మాత్రం గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తనకు తెలిసి ఓ మంచి ఇన్నింగ్స్ను సెంచరీగా మలచడం ఎలాగో తెలిసిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ అని, అలాంటి ఆటగాడు సెంచరీ మిస్ చేసుకోవడం కొద్దిగా బాధ కలిగించదని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్లో భారత్ ఆడిన విధానం గురించి, ఓటమి నుంచి కోలుకుని గెలుపును సొంతం చేసుకోవడాన్ని గురించి కూడా గవాస్కర్ స్పందించాడు. ఈ మ్యాచ్తో ప్రత్యర్థి జట్లకు భారత్ ఓ బలమైన మెసేజ్ పంపించిందన్నాడు. తాము ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా తేరుకుని విజయాన్ని సొంతం చేసుకోగలమని నిరూపించిందన్నాడు.
కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొన్న తీరు, ఇన్నింగ్స్ను ముందుకు నడిపిన విధానం యువ బ్యాటర్లకు ఓ పాఠం వంటిదన్నాడు. ఇక బౌలింగ్లో కూడా భారత బౌలర్లు చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారని అభినందించాడు.