వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం పది వేదికల్లో ఈ మ్యాచులు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో చాలా స్టేడియాలు, రాష్ట్ర క్రికెట్ బోర్డులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బీసీసీఐ తమపై వివక్ష చూపించిందని మండిపడుతున్నాయి. సాధారణంగా వేదికలు ఎన్ని ఉండాలని ఐసీసీ ఏం చెప్పదు. అలాగే ఐసీసీ వేదికలను గుర్తించదు కూడా.
ఈ బాధ్యత అంతా టోర్నీ నిర్వహించే బోర్డుకే వదిలేస్తుంది. అంటే ఈ వేదికల గుర్తింపు బీసీసీఐ పనే. ఈ క్రమంలోనే మొహాలీ, ఇండోర్, తిరువనంతపురం వంటి వేదికలకు బీసీసీఐ మొండిచెయ్యి చూపింది. దీంతో ఈ క్రికెట్ సెంటర్ల నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది మరో అడుగు ముందుకేసి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా తమకు మ్యాచులు రానివ్వలేదని ఆరోపిస్తున్నారు.

ఒక లెక్కగా ఇన్ని స్టేడియాల్లోనే మ్యాచులు జరగాలని ఐసీసీ చెప్పదు. కానీ సాధ్యమైనన్ని తక్కువ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహిస్తే లాజిస్టిక్స్ ఖర్చు కలిసొస్తుంది. అయితే 2019లో ఇంగ్లండ్లో జరిగిన వరల్డ్ కప్ కోసం 11 స్టేడియాలు ఎంపిక చేశారు. ఇంగ్లండ్ అంత పెద్ద దేశం కాదు. కాబట్టి ప్లేయర్లు విమానాల్లో ప్రయాణించాల్సిన అవసరమే రాలేదు. ఇక కొంచెం పెద్దదైన ఆస్ట్రేలియాలో 2015 వరల్డ్ కప్ జరిగింది.
ఆ టోర్నీని 14 వేదికల్లో ఏర్పాటు చేశారు. కాబట్టి భారత్ కూడా అలాగే 15 వరకు వేదికలను ఎంపిక చేస్తుందని చాలా మంది అనుకున్నారు. అయితే బీసీసీఐ మాత్రం కేవలం పది స్టేడియాలనే సెలెక్ట్ చేసింది. ఈ క్రమంలో ఇండోర్ వంటి వేదికలను ఇగ్నోర్ చేసింది. దీనిపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభిలాష్ ఖండేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'ఇండోర్లో అప్పుడెప్పుడో 1987లో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. మళ్లీ వరల్డ్ కప్ మ్యాచ్ జరగలేదు. ఇంత మంచి స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచులు జరగకపోవడం చాలా బాధాకరం. బీసీసీఐ ఏ లెక్కన స్టేడియాలు సెలెక్ట్ చేసిందో నాకు తెలీదు. కానీ ఇండోర్కు చాలా క్రికెట్ హిస్టరీ ఉంది. అందుకే ఇక్కడ వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుందని అనుకున్నాం' అని చెప్పాడు.