వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల్లోనే టీమిండియా ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్ తెలిసింది. గాయం కారణంగా ఏడాదిగా క్రికెట్కు దూరంగా ఉన్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దాదాపు కోలుకున్నట్లేనట. వెన్నునొప్పి కారణంగా చాలా ఇబ్బంది పడిన బుమ్రా.. ఈ ఏడాది మార్చిలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ ఆపరేషన్ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో రికవర్ అవుతున్నాడు.
బుమ్రా చివరగా భారత్ తరఫున గతేడాది సెప్టెంబరులో ఆడాడు. గాయంతో కొన్ని నెలలు ఆటకు దూరమైన తర్వాత.. టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకున్న సెలెక్టర్లు అతన్ని ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. ఆ సిరీస్లో బుమ్రా గాయం తిరగబెట్టింది. దీంతో అతను మళ్లీ ఆటకు దూరమయ్యాడు. అప్పటి నుంచి క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్లో కూడా అతను ఆడలేదు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో బుమ్రా కోలుకుంటున్నట్లు ఎన్సీయేకు సంబంధించిన ఒక వ్యక్తి వెల్లడించాడు. ప్రస్తుతం ఎన్సీయేలో బుమ్రా ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే ఆగస్టులో ఐర్లాండ్తో భారత్ ఆడే టీ20 సిరీసులో అతను పునరాగమనం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ టీ20ల కోసం కుర్రాళ్లతో కూడిన జట్టుతో కలిసి బుమ్రా ఆడతాడని సమాచారం.
'ఇలాంటి గాయాల నుంచి ఫలానా టైం నాటికి కోలుకోవాలని అని టైం లైన్ పెట్టుకోవడం కుదరదు. ఎందుకంటే వీటిని నిరంతరం మానిటర్ చేస్తూనే ఉండాలి. అయితే బుమ్రా మాత్రం చాలా బాగా కోలుకుంటున్నాడని చెప్పాలి. ఎన్సీయే నెట్స్లో అతను తాజాగా ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేశాడు. ఆరంభంలో చాలా లైట్ వర్కవుట్లు, చిన్న బౌలింగ్ సెషన్స్లో మాత్రమే అతను పాల్గొన్నాడు. దాంతో పోల్చుకుంటే ఇలా ఏడు ఓవర్లు వేస్తున్నాడంటే బుమ్రా బాగా కోలుకున్నట్లే' అని సదరు వ్యక్తి తెలియజేశాడు.
వచ్చే నెలలో బుమ్రా కొన్ని ప్రాక్టీస్ మ్యాచులు ఆడతాడని, ఆ తర్వాతనే బుమ్రా ఫిట్నెస్పై ఒక అంచనాకు వస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కండిషనింగ్ కోచ్ రామ్జీ శ్రీనివాసన్ కూడా పేసర్ల ఫిట్నెస్ చాలా ముఖ్యం అని చెప్పాడు. అలాగే బుమ్రాను మరీ తొందరపెడితే అసలుకే ఎసరు వస్తుందని మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన హెచ్చరికలను గుర్తుచేశాడు. బుమ్రాను తొందర పెట్టకపోవడమే మంచిదన్నాడు.