సౌతాఫ్రికా, పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్ నాయకత్వంలో తమ లక్ పరీక్షించబోతోంది. ఈ రోజు మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. ఇక వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత దారుణ ప్రదర్శనతో బాధపడుతున్న ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్లో అయినా గెలిచి వరుస ఓటములకు తెర దించాలని భావిస్తోంది.
శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక గాయం కారణంగా జట్టుకు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో కుశాల్ మెండిస్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాను ఢీ కట్టబోతోంది శ్రీలంక. రెండు జట్లు వరుస ఓటముల నుంచి ఎలాగైనా బయటపడాలని బలంగా కోరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన శ్రీలంక కొత్త కెప్టెన్ కుశాల్ మెండిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పగటి సమయంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించేలా ఉందని, అలాగే జట్టులో స్పిన్నర్లు ఉండడం వల్ల ముందు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని కుశాల్ తెలిపాడు.

అలాగే దాసున్ శనక గాయంతో జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో చమిక, కరుణరత్నేను తీసుకున్నట్లు చెప్పిన మెండిస్.. అతడితో పాటు మతీసా పతిరాన స్థానంలో లాహిరు కుమార జట్టులోకొచ్చాడని తెలిపాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. పిచ్పై కనీసం 280 నుంచి 300 స్కోరు చేయగలిగితే మ్యాచ్పై పట్టు సాధించగలమని, గెలిచేందుకు అదే తమ ప్లాన్ అని కుశాల్ అన్నాడు.
అనంతరం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. తాను కూడా టాస్ గెలిచుంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినన్నాడు. అయితే జట్టు మొత్తం చెమటోడ్చి ప్రాక్టీస్ చేసిందని, ఫలితంగా ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నామన్నాడు. అలాగే జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని, సౌతాఫ్రికాతో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని కమిన్స్ వివరించాడు.
శ్రీలంక జట్టు:
పథుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్, వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, మహీష్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, లాహిరు కుమార.
ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జాష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయినిస్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జాష్ హేజల్వుడ్.