శ్రీలంకతో కీలక పోరుకు టీమిండియా రెడీ అవుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో గెలిస్తే.. టీమిండియా సెమీస్ బెర్తు ఖాయం అవుతుంది. వరల్డ్ కప్లో ఇప్పటి వరకు ఓటమి లేకుండా ఉన్న టీమిండియా అదే జోరు చూపించాలని అనుకుంటోంది. ఈ క్రమంలో ఈ మ్యాచులో పలు రికార్డులు బద్దలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అవేంటంటే?
అయ్యర్ అడుగు దూరంలో..:టీమిండియాలో అంత గొప్ప ఫామ్లో లేని ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. అయినా కూడా అతను ఒక అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకు 48 వన్డేల్లో 1935 పరుగులు చేసిన అయ్యర్.. ఈ మ్యాచులో కనుక 65 పరుగులు చేస్తే 2 వేల పరుగుల మైలురాయి చేరుకుంటాడు.

అంతేకాదు, టీమిండియా తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా, మొదటి నాన్ ఓపెనర్ బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ 52 ఇన్నింగ్సుల రికార్డును బద్దలు కొడతాడు. శుభ్మన్ గిల్ (38) ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
లంక యువతరంగం..:శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ్ కూడా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకు 26 వన్డే ఇన్నింగ్సుల్లో 946 పరుగులు చేసిన అతను.. ఈ మ్యాచులో కనుక 54 పరుగులు చేస్తే సంచలనం సృష్టిస్తాడు.
ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన శ్రీలంక బ్యాటర్గా నిలుస్తాడు. ఈ క్రమంలో ఉపుల్ తరంగ, కుశాల్ మెండిస్, చరిత్ ఆశలంక పేరిట ఉన్న 28 ఇన్నింగ్సుల రికార్డును బద్దలు కొడతాడు.
సంచలనాల షమీ..:ఈ వరల్డ్ కప్లో టీమిండియా బ్యాకప్ పేసర్గా అనుకున్న షమీ.. ఆడిన రెండు మ్యాచుల్లోనే తానేంటో నిరూపించాడు. కివీస్పై ఐదు వికెట్లు తీసుకున్న అతను.. ఇంగ్లండ్పై నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో వరల్డ్ కప్లలో ఓవరాల్గా 13 మ్యాచుల్లోనే 40 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
షమీ కనుక లంకపై ఐదు వికెట్లు తీసుకుంటే.. భారత్ తరఫున వరల్డ్ కప్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలుస్తాడు. ఈ క్రమంలో జహీర్ ఖాన్ (44), జవగళ్ శ్రీనాథ్ (44) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు.
జహీర్ 23 మ్యాచుల్లో ఈ ఘనత సాధించగా.. శ్రీనాథ్ 34 మ్యాచుల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. లంకపై ఐదు వికెట్లు తీసుకుంటే షమీ కేవలం 14 మ్యాచుల్లోనే ఈ రికార్డును బద్దలు కొడతాడు. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్ చూస్తుంటే ఇది అసాధ్యంగా ఏం కనిపించడం లేదు.