వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ కు ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా యువ సంచలనం శుభ్మన్ గిల్ కు డెంగ్యూ సోకింది. దీంతో అతను ఆస్ట్రేలియాతో జరిగే తొలి వరల్డ్ కప్ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచుతోనే ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రయాణం మొదలవుతుంది. మంచి ఫామ్ లో ఉన్న గిల్ ఈ మ్యాచులో రాణిస్తాడని అంతా ఆశించారు. రోహిత్ తో కలిసి భారత్ కు గిల్ శుభారంభాలు ఇవ్వడం ఈ మెగాటోర్నీలో చాలా కీలకం. అప్పుడే భారత్ కు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి.

ఆదివారం నాడు ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచులో కూడా గిల్, రోహిత్ భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు సడెన్ గా గిల్ కు డెంగ్యూ సోకిందని తెలిసి అంతా షాకవుతున్నారు.
ఈ వార్త నిజమే అయితే అతను ఆసీస్ తో మ్యాచ్ సమయానికి కోలుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. ఒకవేళ గిల్ కనుక ఈ మ్యాచ్ సమయానికి కోలుకోలేదంటే.. రోహిత్ కు జోడీగా యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ను పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత దేశం అంతటా డెంగ్యూ కేసులు బాగా ప్రబలుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో గిల్ కు కూడా డెంగ్యూ సోకడం ఫ్యాన్స్ లో టెన్షన్ పెంచుతోంది. ఇక అతని స్థానంలో ఓపెనింగ్ చేసే కిషన్ కూడా ఓపెనర్ గా మంచి రికార్డు ఉన్న బ్యాటరే. కాబట్టి రోహిత్ తో కలిసి అతను కూడా జట్టుకు భారీ ఓపెనింగ్ అందిస్తాడని ఆశిస్తున్నారు.