చెన్నై: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు బోణీ కొట్టింది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని 41.2 ఓవర్లల్లో ఛేదించింది. కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ప్రారంభంలోనే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆదుకున్న మ్యాచ్ అది. హాఫ్ సెంచరీలో చెలరేగారు. జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది భారత్. రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.

బుధవారం తన రెండో మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది టీమ్. జోరుగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోంది. నెట్స్లో ప్లేయర్లు చెమటోడుస్తోన్నారు.
ఈ రెండు జట్లకూ ఇది రెండో మ్యాచ్. ఈ టోర్నమెంట్లో తాను ఆడిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో మట్టికరిచింది ఆఫ్ఘనిస్తాన్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 156 పరుగులకే కుప్పకూలిపోగా.. ఆ స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 34.4 ఓవర్లల్లో కొట్టేసింది. నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
దీని తరువాత పాకిస్తాన్ను ఢీకొట్టాల్సి ఉంది టీమిండియాకు. ఈ నెల 14వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో షెడ్యూల్ అయిన మ్యాచ్ ఇది. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి అంతా దీనిమీదే ఉంది. మొన్నటికి మొన్న ఆసియాకప్లో టీమిండియా చేతిలో చావుదెబ్బలు తిన్న అనుభవం ఉన్నందున పాకిస్తాన్ జట్టు భారత్పై ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది.
ఈ పరిస్థితుల్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్.. ఆసుపత్రి పాలయ్యాడు. కొద్దిరోజులుగా డెంగ్యూ ఫీవర్తో అతను బాధపడుతున్నాడు. జ్వర తీవ్రత మరింత పెరగడంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. బీసీసీఐ డాక్టర్ రిజ్వాన్ ఖాన్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటోన్నాడు.

గిల్ ప్లేట్లెట్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచడం, జ్వరం తీవ్రత తగ్గేలా తక్షణ వైద్యాన్ని అందిస్తోన్నారు. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిన సమయంలో విశ్రాంతిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది.
ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్తో ఇంకో నాలుగు రోజుల వ్యవధిలో జరగబోయే మ్యాచ్ నాటికి శుభ్మన్ గిల్ అందుబాటులోకి రాకపోవచ్చని తెలుస్తోంది. డెంగ్యూ తీవ్రత తగ్గినప్పటికీ.. విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నందున పాకిస్తాన్తో జరిగే మ్యాచ్కు తుదిజట్టులో అతనికి చోటు దక్కకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.