భారత జట్టు ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ నెగ్గాలని టీమిండియా మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. 2011లో సచిన్ టెండూల్కర్ కోసం భారత జట్టు వరల్డ్ కప్ నెగ్గిందని, ఇప్పుడు అలాగే కోహ్లీ కోసం గెలవాలని కోరాడు. అప్పుడు ట్రోఫీ నెగ్గిన టీంలో కోహ్లీ కూడా సభ్యుడనే సంగతి తెలిసిందే. అది సచిన్కు చివరి వన్డే వరల్డ్ కప్ కూడా. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ ఇద్దరికీ ఇది చివరి వన్డే వరల్డ్ కప్.
తాజాగా ఒక సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో దిగిన ప్రతిసారీ కోహ్లీ తన నూరుశాతం ఎఫర్ట్ ఇస్తాడని, ఈ వరల్డ్ కప్లో పిచ్లు కూడా అతని బ్యాటింగ్కు అనుకూలిస్తాయని అనుకుంటున్నానని తెలియజేశాడు. అలాగే తాము 2011లో సచిన్ కోసం వరల్డ్ కప్లో రాణించామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా భారత్ అదే చేయాలని చెప్పుకొచ్చాడు.

'మేం సచిన్ కోసం వరల్డ్ కప్ ఆడాం. మేం వరల్డ్ కప్ గెలిస్తే సచిన్కు అది గొప్ప వీడ్కోలు అవుతుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా సేమ్. అందరూ కూడా అతని కోసం వరల్డ్ కప్ గెలవాలని ఆడతారు. తను మైదానంలో ఎప్పుడూ వందకు అంతకన్నా ఎక్కువే కష్టపడతాడు' అని సెహ్వాగ్ అన్నాడు. ఇటీవలి కాలంలో వైట్ బాల్ క్రికెట్లో కోహ్లీ మంచి ఫామ్ కనబరచడంతో వరల్డ్ కప్లో కూడా అతను రాణిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
'విరాట్ కోహ్లీ కూడా ఈ వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్నాడని నేను అనుకుంటున్నా. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్ష మంది తనను చూస్తుంటారు. విరాట్కు ఈ పిచ్లు ఎలా ఉంటాయో బాగా తెలుసు. తను ఈ టోర్నీలో చాలా పరుగులు చేస్తాడు. ఎలాగైనా ట్రోఫీ ముద్దాడేందుకు ప్రయత్నిస్తాడు' అని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.

2011 తర్వాత జరిగిన రెండు వన్డే వరల్డ్ కప్లలో భారత జట్టు సెమీస్ వరకు వచ్చింది. కానీ ఈ రెండు టోర్నీల్లో సెమీఫైనల్లో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. 2015లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే.. 2019లో న్యూజిల్యాండ్ చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్లో ఎంఎస్ ధోనీ రనౌట్ అవడం ఎంతో మంది భారత అభిమానుల గుండెలు బద్దలు చేసిన సంగతి తెలిసిందే.