వరల్డ్ కప్లో సంచలనం నమోదైంది. వరుస విజయాలతో దుమ్ములేపుతూ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచిన సౌతాఫ్రికాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ధర్మశాల వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో పసికూన నెదర్లాండ్స్ చేతిలో సఫారీలు చావుదెబ్బ తిన్నారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఒకానొక దశలో 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగుల స్కోరు చేసింది.

ఛేజింగ్లో క్వింటన్ డీ కాక్ (20), టెంబా బవుమా (16) ఇద్దరూ కూడా సఫారీ జట్టుకు సరైన ఆరంభం అందించలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన రాసీ వాన్ డర్ డస్సెన్ (4), ఎయిడెన్ మార్క్రమ్ (1) కూడా తేలిపోయారు. చివర్లో కేశవ్ మహరాజ్ (40) జట్టుకు అండగా నిలిచాడు. కానీ చివరి ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన అతను కూడా పెవిలియన్ చేరడంతో ఈ జట్టు 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇలా ఓడిపోవడంపై సఫారీ కెప్టెన్ టెంబా బవుమా నిరాశ వ్యక్తం చేశాడు. '112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆ టీంను 200 స్కోరు దాటనివ్వకుండా ఉండాల్సింది. అక్కడే మేం పట్టు కోల్పోయాం. కానీ ఛేజింగ్ చేసేస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ నెదర్లాండ్స్ బౌలర్లు మా బ్యాటింగ్లో ఉన్న ఏదో లోపాన్ని పట్టుకున్నారు. మేం ఆసీస్పై బాగా ఆడాం. మరీ ఎక్కువ ఎక్స్ట్రాలు వేయకుండా కంట్రోల్ చేయాల్సింది' అని చెప్పాడు.
'మా ఫీల్డింగ్ కూడా స్థాయికి తగ్గట్లు లేదు. ఆసీస్పై మేం చేసిన స్థాయిలో ఉన్నట్లు కనిపించలేదు. కుర్రాళ్లతో కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది కచ్చితంగా మమ్మల్ని బాధిస్తుంది. కానీ ఈ ఒక్క ఓటమితో మా ప్రయాణం ఏమీ దెబ్బతినలేదు. నెదర్లాండ్స్ అద్భుతంగా ఆడింది. మ్యాచ్ ఆసాంతం వాళ్లు మాపై ఒత్తిడి పెడుతూనే వచ్చారు' అని బవుమా పేర్కొన్నాడు.