వరల్డ్ కప్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సెమీస్ చేరిన సౌతాఫ్రికాను ఆఫ్ఘనిస్తాన్ ఢీకొట్టనుంది. శ్రీలంకపై కివీస్ విజయంతో ఆఫ్ఘన్ సెమీస్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఈ క్రమంలో తమ వరల్డ్ కప్ జర్నీని విజయంతో ముగించాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. అదే సమయంలో సెమీఫైనల్ ముందు ప్రయోగాలకు చేయడానికి ఈ మ్యాచ్ను సౌతాఫ్రికా ఉపయోగించుకుంటోంది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడి పిచ్ బ్యాటర్లకు సహకరిస్తుందని పేరు. కాబట్టి ఈ మ్యాచులో కూడా మంచి స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడి వాతావరణం, పిచ్ చూసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో స్పిన్నర్లకు పిచ్ నుంచి సహకారం అందే అవకాశం ఉందని షాహిదీ అభిప్రాయపడ్డాడు. తమ టీంలో ఎలాంటి మార్పులు చేయలేదని, ఆసీస్తో ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని అన్నాడు. ఆ మ్యాచ్ తమకు చాలా కఠినమైందని, కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదని అన్నాడు. ఈ మ్యాచ్ గురించే ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు చెప్పాడు.
ఇప్పటి వరకు తాము టోర్నీలో సరిగా ఛేజింగ్ చేయలేదని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నాడు. ఇది తమకు దక్కిన అవకాశం అని చెప్పాడు. ఇండియాతో మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూంలో దీనిపై బాగా చర్చించుకున్నామని తెలిపాడు. ఈ మ్యాచులో తాము రెండు కీలక మార్పులు చేశామన్నాడు. యాన్సెన్, షంసీ ఇద్దరికీ విశ్రాంతి ఇచ్చామని, వారి స్థానంలో కోట్జీ, పెహ్లుక్వాయో ఆడుతున్నారని తెలిపాడు.
ఇక్కడి పిచ్ చూస్తుంటే రెండో ఇన్నింగ్సులో మరింత వేగంగా మారే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోందన్నాడు. ఎండలోనే స్పిన్నర్లకు సహకరించేలా ఉందన్నాడు. మరి ఈ మ్యాచులో విజయవంతంగా ఛేజ్ పూర్తి చేసి, సెమీస్కు ధైర్యంగా సౌతాఫ్రికా వెళ్తుందేమో చూడాలి. అలాగే ఈ మ్యాచులో విజయంతో టోర్నీని ఘనంగా ముగించాలనే ఆఫ్ఘన్ ఆశ నెరవేరుతుందా? అని ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.