ఈసారి వరల్డ్ కప్లో ఫేవరెట్ జట్లు ఏవి? ప్రస్తుతం మాజీ దిగ్గజాల మధ్య జరుగుతున్న చర్చ ఇదే. ఈ క్రమంలోనే శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర కూడా ఈ విషయంపై తన అంచనా వెల్లడించాడు. అక్టోబర్ 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే.
ఇటీవల ముగిసిన ఆసియా కప్లో జట్ల ఆటతీరును కూడా సంగక్కర పరిగణనలోకి తీసుకున్నాడు. ఈ టోర్నీలో సూపర్-4 దశలో జరిగిన మ్యాచులో పాకిస్తాన్పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన శ్రీలంక ఫైనల్ చేరింది. కానీ పైనల్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు తేలిపోయారు. దీంతో ఆ టీం కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ మ్యాచులను పరిగణనలోకి తీసుకున్న సంగక్కర.. ఈసారి వరల్డ్ కప్లో ఫేవరెట్ జట్లుగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి జట్లను లెక్కలోకి తీసుకోలేదు. పలువురు మాజీలు ఈ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్ తదితర జట్లు టాప్-4లో ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ అభిప్రాయాలతో సంగక్కర విభేదించాడు.
'నా అభిప్రాయం ప్రకారం ఇంగ్లండ్, భారత్ టాప్ ఫేవరెట్లు. ఆసియా కప్లో శ్రీలంక ఆటను నేను గమనించా. వాళ్ల ఆటతీరు చూస్తే ప్లేఆఫ్స్ స్థానం కోసం గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు. అదే జరిగి ప్లేఆఫ్స్ చేరితే ఒక్క మ్యాచ్ గెలిస్తే ఫైనల్ చేరుకోవచ్చు. ఆ రోజు కనుక శ్రీలంక మెరుగ్గా ఆడితే ఫైనల్ చేరినా చేరుతుంది' అని సంగక్కర చెప్పుకొచ్చాడు.

ఇదే విషయంపై ఇంగ్లండ్ మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. టీమిండియాకు హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ చాలా ముఖ్యమని చెప్పాడు. పాండ్యా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడని, అలాగే లోయర్ ఆర్డర్లో బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఫిట్గా ఉంటే టీమిండియా కచ్చితంగా ఫేవరెట్గా మారుతుందని అభిప్రాయపడ్డాడు.