ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ అంబాసిడర్ గా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే అహ్మదాబాద్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్ కు సచిన్ వచ్చాడు. మ్యాచ్ ముందు ట్రోఫీని తనే తీసుకొచ్చి మైదానంలో ఉంచాడు. ఆ తర్వాత కాసేపు కామెంటరీ కూడా చెప్పాడు.
ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో సచిన్ ఇలా కామెంటరీ బాక్సులో సందడి చేశాడు. ఈ టైంలో అతనితోపాటు విండీస్ లెజెండ్ ఇయాన్ బిషప్ తదితరులు ఉన్నారు. ఈ సమయంలో భారత జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందా? అని బిషప్ ప్రశ్నించాడు. దీనికి బడులిచ్చిన సచిన్.. ప్రస్తుతం టీమిండియా మంచి బ్యాలెన్స్ తో ఉందని అన్నాడు.

వాళ్ళు కనుక అనుకున్న స్థాయిలో రాణిస్తే 2011 తరహాలోనే వన్డే వరల్డ్ కప్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశాడు. అదే సమయంలో సచిన్ దృష్టిలో సెమీఫైనల్ చేరే జట్లు ఏవి? అని బిషప్ ప్రశ్నించాడు. దీనికి కాస్త ఆలోచించిన సచిన్.. జట్టులో బ్యాలెన్స్ ఉన్న జట్లు మాత్రమే సెమీఫైనల్ చేరుతాయని అభిప్రాయపడ్డాడు. అందుకే పాకిస్తాన్ వంటి టీంను తన బెస్ట్ ఫోర్ టీమ్స్ లో తీసుకోలేదు.
"కచ్చితంగా టీమిండియా సెమీస్ చేరుతుంది. ఎందుకంటే భారత జట్టులో ప్రస్తుతం మంచి బ్యాలెన్స్ ఉంది. ఈ టీమ్ చాలా మంచి క్రికెట్ కూడా ఆడుతోంది. కాబట్టి ఈ టీమ్ గ్యారంటీగా సెమీస్ చేరుతుందని నా నమ్మకం. ఇక ఆస్ట్రేలియా కూడా చాలా మంచి బ్యాలెన్స్ తో కనిపిస్తోంది. కాబట్టి ఆ టీమ్ కూడా సెమీస్ చేరడం ఖాయం" అని సచిన్ చెప్పుకొచ్చాడు.
అలాగే ఇంగ్లండ్ కూడా చాలా సమతూకంగా ఉందని చెప్పిన సచిన్.. కుర్రాళ్ళు, అనుభవజ్ఞులతో ఆ జట్టు చాలా బలంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇక చివరి ప్లేస్ ను న్యూజిల్యాండ్ కు ఇచ్చాడీ లెజెండ్. "2015, 2019 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడిందీ టీం. వాళ్ళ రికార్డ్ చూస్తేనే వరల్డ్ కప్ లో కివీస్ ఎంత డేంజర్ టీం అని చెప్పొచ్చు" అని సచిన్ పేర్కొన్నాడు.