చెన్నై: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు బోణీ కొట్టింది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని 41.2 ఓవర్లల్లో ఛేదించింది. కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ప్రారంభంలోనే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆదుకున్న మ్యాచ్ అది. హాఫ్ సెంచరీలో చెలరేగారు. జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది భారత్. రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.

బుధవారం తన రెండో మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది టీమ్. జోరుగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోంది. నెట్స్లో ప్లేయర్లు చెమటోడుస్తోన్నారు.
దీని తరువాత పాకిస్తాన్ను ఢీకొట్టాల్సి ఉంది టీమిండియాకు. ఈ నెల 14వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో షెడ్యూల్ అయిన మ్యాచ్ ఇది. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి అంతా దీనిమీదే ఉంది. మొన్నటికి మొన్న ఆసియాకప్లో టీమిండియా చేతిలో చావుదెబ్బలు తిన్న అనుభవం ఉన్నందున పాకిస్తాన్ జట్టు భారత్పై ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది.
ఈ పరిస్థితుల్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్.. ఆసుపత్రి పాలయ్యాడు. కొద్దిరోజులుగా డెంగ్యూ ఫీవర్తో అతను బాధపడుతున్నాడు. జ్వర తీవ్రత మరింత పెరగడంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. బీసీసీఐ డాక్టర్ రిజ్వాన్ ఖాన్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటోన్నాడు.
దీనితో- శుభ్మన్ గిల్ స్థానంలో తుదిజట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను కొనసాగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో పాటు పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లోనూ అతన్ని ఆడించవచ్చు జట్టు మేనేజ్మెంట్. రోహిత్ శర్మతో పాటు అతను ఇన్నింగ్ను ఆరంభించవచ్చు.
అదే సమయంలో బ్యాకప్ కోసం మరో ప్లేయర్ను కూడా జట్టులో చోటు కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. శుభ్మన్ గిల్ ఓపెనర్ కావడం వల్ల- అతని స్థానంలో ఇషాన్ కిషన్ను కొనసాగిస్తూనే మరో ప్లేయర్ను జట్టులోకి తీసుకోవచ్చు. ఓపెనర్గా ఆడిన అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పించవచ్చు.
ఈ క్రమంలో జట్టు ఇన్నింగ్ను ఆరంభించిన అనుభవం ఉన్న రుతురాజ్ గైక్వాడ్ లేదా యశస్వి జైస్వాల్కు పిలిపించాలని భావిస్తోంది. ఈ ఇద్దరు కూడా ఓపెనర్గా సక్సెస్ అయినవారే. చైనాలో ముగిసిన ఆసియా గేమ్స్ 2023లో జైస్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. ఆ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యాన్ని వహించాడు. వారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇద్దరిలో ఒకర్ని జట్టులోకి తీసుకోవచ్చు.