న్యూజిల్యాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓడినా, గెలిచినా భారత జట్టు టోర్నీ ఫేవరెట్టేనని న్యూజిల్యాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ అన్నాడు. రెండు జట్లూ పటిష్ఠంగా ఉన్నాయని, ఇది కచ్చితంగా టోర్నీలోనే ఇంటెన్స్ మ్యాచ్ అవుతుందన్న టేలర్.. భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఒకపక్క ఆడిన నాలుగు మ్యాచ్ల్లో గెలిచి మంచి ఊపు మీదున్న టీమిండియా.. మరోపక్క నాలుగు మ్యాచ్ల్లో గెలవడమే కాకుండా.. టేబుల్ టాప్ ప్లేస్లో ఉన్న న్యూజిల్యాండ్.. ఈ రెండు జట్ల మధ్య పోరంటే ఎంత ఆసక్తిగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే కివీస్ మాజీ స్టార్ బ్యాటర్ రాస్ టేలర్ కూడా టీమిండియా, న్యూజిల్యాండ్ జట్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఈ వరల్డ్ కప్లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోందన్న టేలర్.. దూకుడుగా ఆడడమే కాకుండా.. నిలకడైన ఆటతీరుతో టోర్నీలో దూసుకుపోతోందన్నాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా సూపర్ బౌలింగ్తో అదరగొడున్నారని, వాళ్లని ఎదుర్కోవడం కివీస్కు పెద్ద సవాలేనన్నాడు.
అలాగే టాప్ త్రీ బ్యాటర్లు.. రోహిత్, గిల్, కోహ్లీల గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ వాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. వాళ్లతో పాటు 4, 5 స్థానాల్లో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా సత్తా చాటుతున్నారని, ఈ లెక్కన టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్ఠంగా ఉందన్నాడు.
ఇక న్యూజిల్యాండ్ జట్టు గురించి మాట్లాడుతూ.. టోర్నీ తొలి గేమ్లోనే న్యూజిల్యాండ్ తామేంటో నిరూపించిందన్నాడు టేలర్. ఆ మ్యాచ్లో ఇంగ్లీష్ బౌలర్లను తమ బ్యాటర్లు ఎదుర్కొన్న తీరు చాలా గొప్పగా ఉందని ప్రశంసించాడు. అలాగే ఆఫ్ఘన్ జట్టుపై తీవ్ర ఒత్తిడి నుంచి బయటపడి మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్న తీరు, మ్యాచ్ గెలిచిన విధానం అద్భుతమని కొనియాడాడు.
తమ జట్టు బ్యాటింగ్ లైనప్ కూడా మంచి ఫాంలో ఉండడం కలిసొస్తుందన్నాడు. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా టాప్ ఆర్డర్ను వేగంగా అవుట్ చేయగలిగితే మిడిలార్డర్పై ఒత్తిడి పెరుగుతుందని, న్యూజిల్యాండ్ గెలవాలంటే అదొక్కటే దారని రాస్ టేలర్ చెప్పుకొచ్చాడు.