వరల్డ్ కప్లో 20 ఏళ్ల తర్వాత న్యూజిల్యాండ్ను టీమిండియా ఓడించింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. భారీ స్కోరు చేసేలా కనిపించింది. తన క్యాచ్ నేలపాలు చేసిన రవీంద్ర జడేజా.. ఎంత తప్పు చేశానని బాధ పడేలా రచిన్ రవీంద్ర (75) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అతనికి జత కలిసిన డారియల్ మిచెల్ (130) కూడా చెలరేగాడు. అయితే చివర్లో మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో సత్తా చాటడంతో కివీస్ కేవలం 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిచెల్, రవీంద్ర మినహా మిగతా ఏ బ్యాటర్నూ క్రీజులో కుదురుకోనివ్వలేదు భారత బౌలర్లు. దీంతో ఆ టీం ఆశించిన భారీ స్కోరు చేయలేకపోయింది.

ఇక లక్ష్య ఛేదనను భారత్ దూకుడుగానే ఆరంభించింది. కానీ ఛేజ్ను ముందుండి నడిపించడం మాత్రం ఎవరి వల్లా కాలేదు. ఇక్కడే విరాట్ కోహ్లీ మరోసారి రాణించాడు. ఒక పక్క వికెట్లు కూలుతున్నా తనదైన స్టైల్లో ఆడిన కోహ్లీ.. 95 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివర్లో రవీంద్ర జడేజా (39 నాటౌట్) బౌండరీతో మ్యాచ్ ముగించాడు.
ఈ మ్యాచ్ అనంతరం విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. 'టోర్నీలో మాకు మంచి ఆరంభం లభించింది. షమీ తన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తను చాలా అనుభవజ్ఞుడు, మంచి క్లాస్ ఉన్న ప్లేయర్. పరిస్థితులను కూడా చక్కగా ఉపయోగించుకున్నాడు' అని మెచ్చుకున్నాడు.
'ఒకానొక దశలో కివీస్ చాలా మంచి భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ తర్వాత మంచు కూడా ప్రభావం చూపించింది. చివర్లో బౌలర్లు చెలరేగారు. గిల్, నా ఆటతీరు ఇద్దరికీ సరిగ్గా సూట్ అవుతుంది. అయితే మేమే మంచి స్కోర్లు చేయడంలో ఫెయిలయ్యాం. కానీ గెలిచినందుకు సంతోషంగా ఉంది' అన్నాడు.
'విరాట్ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. తను ఇదే పని ఏళ్ల తరబడి చేస్తూనే ఉన్నాడు. చివర్లో వికెట్లు కోల్పోవడంతో కొంత ఒత్తిడి ఉంది. కానీ కోహ్లీ, జడ్డూ మమ్మల్ని విజయతీరాలకు చేర్చారు. మా ఫీల్డింగ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది. కానీ ఈ మ్యాచులో కొన్నీ ఈజీ క్యాచులు వదిలేశాం' అని గుర్తుచేసుకున్నాడు.
'జడేజా ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్లలో ఒకడు. కొన్ని క్యాచులు వదిలేశారని ఫీల్డర్లను తక్కువ అంచనా వేయకూడదు. మాకు ప్రయాణం చేయడం చాలా ఇష్టం. అలాగే దేశంలో వివిధ ప్రదేశాల్లో ఆడటాన్ని కూడా ఎంజాయ్ చేస్తాం. ఇప్పటి వరకైతే మేం ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు. అలాగే ఫ్యాన్స్ను కూడా డిసప్పాయింట్ చేయలేదు' అని పేర్కొన్నాడు.