ప్రస్తుతం టీమిండియాకు అతి పెద్ద సమస్యగా మారిన అంశాల్లో రవీంద్ర జడేజా ఒకడు. బౌలింగ్లో చక్కగా రాణిస్తున్న అతను బ్యాటింగ్లో మరీ దారుణంగా తేలిపోతున్నాడు. ఆస్ట్రేలియాతో రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో వన్డే చూసిన అందరికీ జడ్డూ బ్యాటింగ్ దారుణంగా తయారైందని అర్థమైంది. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లడంలో జడ్డూ విఫలమయ్యాడు.
రాజ్కోట్ వంటి బ్యాటింగ్ పిచ్పై అతి కష్టం మీద 35 పరుగులు చేశాడీ ఎడం చేతి వాటం బ్యాటర్. మరో వారం రోజుల్లో వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో జడ్డూ బ్యాటింగ్ చూసిన వాళ్లంతా టెన్షన్లో పడిపోయారు. జడ్డూ తన ఆల్రౌండ్ ట్యాలెంట్తో జట్టులో బ్యాలెన్స్ తీసుకొస్తాడన్న మాట నిజమే. కానీ అతను ఏడో నెంబర్లో బ్యాటుతో మెరవకపోతే ఆ బ్యాలెన్స్ పూర్తిగా తడబడుతుంది.

ఈ ఒక్క మ్యాచ్ అనే కాదు. ఈ ఏడాది మొత్తం 12 వన్డే మ్యాచులు ఆడిన జడ్డూ 27 సగటు, 64.28 స్ట్రైక్ రేటుతో కేవలం 189 పరుగులే చేశాడు. ఓవరాల్గా ఇప్పటి వరకు స్వదేశంలో 68 వన్డేలు ఆడాడీ స్టార్ ఆల్రౌండర్. వీటిలో 29.29 సగటుతో 908 పరుగులు చేశాడు. తన కెరీర్లో కేవలం రెండు సార్లే హాఫ్ సెంచరీ మార్కు దాటాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. ఒక బ్యాటర్గా జడ్డూపై దేశం ఆధార పడగలదా? అని టెన్షన్ పడుతున్నారు.
గాయంతో అక్షర్ పటేల్ మెగాటోర్నీకి దూరమైన నేపథ్యంలో ఫినిషర్గా జడ్డూ నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. వన్డేల్లో స్వదేశంలో జడ్డూ హాఫ్ సెంచరీ బాది దాదాపు పదేళ్లకు పైగానే గడిచిపోయిందని తెలిస్తే చాలా మంది నమ్మలేరు. అతను చివరగా 2013 జనవరి 15న ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఆ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో విరాట్ కోహ్లీ (37), యువరాజ్ సింగ్ (32), సురేష్ రైనా (55) చక్కగా రాణించారు. అయితే జడ్డూ, ధోనీ మధ్య కీలక భాగస్వామ్యం వల్ల టీమిండియా అనుకున్న స్కోరు చేయగలిగింది. వీళ్లిద్దరూ ఆరో వికెట్కు 96 పరుగులు జోడించారు. ముఖ్యంగా జడేజా కేవలం 37 బంతుల్లోనే 61 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఆ తర్వాత బౌలింగ్లోనూ ఆకట్టుకున్న అతను ఏడు ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. జడ్డూ ఈ వరల్డ్ కప్లో కూడా అదే స్థాయిలో రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గత వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా 77 పరుగులతో జడ్డూ ఆకట్టుకున్నాడు. బడా వేదికలపై సత్తా చాటే జడ్డూ.. ఈ వరల్డ్ కప్లో కూడా అదే మాదిరి సత్తా చాటాలని ఆశిద్దాం.