వరల్డ్ కప్ ఆడే టీంను బీసీసీఐ ఇటీవల ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు భారత జట్టులో సరైన స్పిన్నర్ లేడంటూ మాజీ లెజెండ్ శివరామకృష్ణన్ కామెంట్ చేశాడు. టీంలో అశ్విన్ ఉన్నా కూడా శివరామకృష్ణన్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని చాలా మంది షాకయ్యారు. దీంతో ఫ్యాన్స్ కూడా అతనిపై మండిపడ్డారు.
భారత్ తరఫున అత్యద్భుతంగా రాణించిన స్పిన్నర్లలో అశ్విన్ ఒకడు. అలాంటి అశ్విన్ అంత గొప్ప స్పిన్నర్ కాదని, అతని కోసం భారత్లో ప్రత్యేకమైన పిచ్లు తయారు చేయడం వల్లనే వికెట్లు తీసుకున్నాడని, ఇలాంటి పిచ్లపై ఎలాంటి వెర్రివాడైనా వికెట్లు తీస్తాడని శివరామకృష్ణన్ అన్నాడు.

ఈ మాటలు విన్న అందరూ షాకయ్యారు. బెస్ట్ స్పిన్నర్లలో ఒకడైన అశ్విన్ను ఇలా అనడం ఏంటని మండిపడ్డారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని శివరామకృష్ణన్ వెల్లడించాడు. తను ఇలాంటి కామెంట్స్ చేసిన తర్వాత అశ్విన్ స్వయంగా తనకు ఫోన్ చేసినట్లు అతను చెప్పాడు. ఆ సమయంలో బౌలింగ్ యాక్షన్ గురించి అశ్విన్ తనను సలహా అడిగినట్లు చెప్పాడు.
ఈ క్రమంలోనే తనపై ట్రోలింగ్ జరగడంపై కూడా అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు చెప్పుకొచ్చాడు. 'బౌలింగ్ యాక్షన్ గురించి మాట్లాడేందుకు అశ్విన్ నాకు కాల్ చేసి మాట్లాడాడు. నాపై ఇంత దారుణంగా ట్రోలింగ్ జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలా ట్రోలింగ్ చేస్తున్న వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. గుడ్ లక్ అశ్విన్' అని శివరామకృష్ణన్ ట్వీట్ చేశాడు.
దీంతో ఈ గొడవకు ఒక ముగింపు లభిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాపై రెండు వన్డేలు ఆడిన అశ్విన్.. రెండింట్లోనూ వికెట్లు తీసుకొని రాణించిన సంగతి తెలిసిందే. దీంతో అక్షర్ పటేల్ స్థానంలో అతన్ని వరల్డ్ కప్లో ఆడించాలని సెలెక్టర్లు నిర్ణయించిన సంగతి తెలిసిందే.