వరల్డ్ కప్కు అంతా రెడీ అయింది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా టోర్నీ మొదలవుతుంది. ఈ క్రమంలో అందరి చూపు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్పై పడింది. అతని నేతృత్వంలో భారత జట్టు ఈ మెగా టోర్నీకి ఏమాత్రం రెడీ అయిందని అంతా చర్చిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రిపరేషన్స్ పట్ల తాను చాలా సంతృప్తిగా ఉన్నట్లు ద్రావిడ్ చెప్పాడు.
ప్రతి ప్లేయర్కూ గేమ్ టైం దొరికిందని, ఈ విషయంలో మాత్రం తను చాలా హ్యాపీ అని అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లకు గేమ్ టైం దొరికిందని, ఇది చాలా కీలకమైన అంశమని ద్రావిడ్ చెప్పాడు. వరల్డ్ కప్ ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచుల్లో మొత్తం 15 మంది పాల్గొంటారన్న ఈ లెజెండ్.. దీని వల్ల ప్రాక్టీస్ గేమ్స్లో అంత ఇంటెన్సిటీ ఉండదని అభిప్రాయపడ్డాడు.

ఈ క్రమంలో అందరికీ గేమ్ టైం దొరకడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు. 'బుమ్రాకు గేమ్ టైం దక్కింది. చివరి మ్యాచుల్లో తన కోటా 10 ఓవర్లు అతను పూర్తి చేశాడు. సిరాజ్ కూడా అనారోగ్యం నుంచి తిరిగొచ్చి బాగానే బౌలింగ్ చేశాడు. ఆసీస్తో జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో అశ్విన్ కూడా చక్కగా ఆడాడు' అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.
వరల్డ్ కప్కు ముందు భారత జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది. వీటిలో తొలి మ్యాచులో గువాహతి వేదికగా ఇంగ్లండ్ టీంతో తలపడనుంది. దీని కోసం ఇప్పటికే భారత జట్టు అంతా గువాహతి చేరుకుంది. భారత జట్టు వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడిందని, ఇప్పుడు అందరూ తిరిగి కోలుకున్నారని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు వరల్డ్ కప్లో తమ తొలి మ్యాచులో ఆస్ట్రేలియాను ఢీకొట్టనున్న సంగతి తెలిసిందే.