వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. కానీ కొందరు మాత్రం దీనిపై పెద్ద చర్చ చేస్తున్నారు. నిజమే.. అన్ని స్టేడియాలకు మ్యాచులు నిర్వహించే సత్తా ఉంది. అందుకని టోర్నీని అన్ని వేదికల్లో పెట్టడం కుదరదు కదా. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ పది వేదికలను సెలెక్ట్ చేసింది. ఈ జాబితాలో చోటు దక్కించుకోని రాష్ట్రాలు అసహనంగా ఉండటం కూడా సహజమే.

అయితే దీనిపై కొందరు రాజకీయాలు చేస్తున్నారు. క్రికెట్లో తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని కేరళ ఎంపీ శశిథరూర్ అన్నాడు. ఇంతకుముందు కూడా థరూర్ ఇలా బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కాడు. తాజాగా వరల్డ్ కప్ షెడ్యూల్ను షేర్ చేసిన ఆయన.. బీసీసీఐపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశంలోనే బెస్ట్ స్టేడియంలో మ్యాచ్లు లేవంటూ ఆగ్రహించాడు.

'దేశంలో బెస్ట్ క్రికెట్ స్టేడియం అని పేరొందిన తిరువనంతపురం స్పోర్ట్స్ హబ్లో వరల్డ్ కప్ 2023 మ్యాచ్లు లేవు. ఇది చూసి చాలా నిరుత్సాహపడ్డా. దేశంలో కొత్త క్రికెట్ క్యాపిటల్గా అహ్మదాబాద్ మారిపోతోంది. కానీ ఒకటి, రెండు మ్యాచులను కేరళకు కూడా ఇవ్వొచ్చు కదా' అని థరూర్ ట్వీట్ చేశాడు. అలాగే పంజాబ్లో కూడా మ్యాచులు లేవంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు మండిపడుతున్నారు.
పంజాబ్ క్రీడాశాఖ మంత్రి, ఆప్ లీడర్ గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ కూడా బీసీసీఐపై విమర్శలు చేశాడు. వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్, చివరి మ్యాచ్ రెండూ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగుతున్నాయని గుర్మీత్ అన్నాడు. అదే సమయంలో మొహాలీలో ఒక్క మ్యాచ్ కూడా పెట్టలేదంటూ వరల్డ్ కప్ షెడ్యూల్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరి ఈ రాజకీయ నేతలు ఇంకా ఎన్ని ఆరోపణలు చేస్తారో చూడాలి.