మూలిగే నక్కమీద తాటికాయ పడడం అనే సామెత ఎప్పుడైనా విన్నారా..? అయితే దానికి ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న పాకిస్తాన్ జట్టు పరిస్థితే పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇప్పటికే వరుస ఓటములతో అసలు టోర్నీలో ఉంటామో, లేదో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ జట్టుకు ఇప్పుడు మరో షాక్ తగిలింది.
ఆ జట్టు వెటరన్ ఆటగాడు, ప్రధాన పేసర్లలో ఒకడు, ఇంకా మాట్లాడితే ప్రస్తుత జట్టులో అంతో ఇంతో ఫాంలో ఉన్న ఆటగాడు ఇప్పుడు జట్టుకు దూరమయ్యాడు. కీలక సౌతాఫ్రికా మ్యాచ్లో సదరు ఆటగాడు జట్టులో ఉండడని పాక్ జట్టు అధికారికంగా ప్రకటించింది.

టోర్నీ మొదట్లో వరుసగా రెండు విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న పాకిస్తాన్ ఆ తర్వాత చతికిల పడింది. వరుసగా మూడు మ్యాచ్లలో ఓడి ఇప్పుడు టోర్నీ నుంచే నిష్క్రమించేలా కనిపిస్తోంది. అయితే మిగిలిన మ్యాచ్లలో గెలిస్తే పాక్కు సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి.
కానీ ఈ మ్యాచ్లలో ఒక్క బంగ్లాదేశ్ మినహా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిల్యాండ్.. అన్నీ టఫ్ జట్లే. ఇందులో మొదట సౌతాఫ్రికాతో పాక్ తలపడనుంది. ఈ జట్టుపై గెలవాలంటే పాక్ కచ్చితంగా తన 100 శాతం ప్రతిభ చూపించాలి. కానీ ఈ మ్యాచ్ ముందు పాక్కు పెద్ద షాక్ తగిలింది.
ఆ జట్టు ప్రధాన పేసర్లలో ఒకడైన హసన్ అలీ జట్టుకు దూరమయ్యాడు. జ్వరంతో బాధపడుతున్న హసన్ అలీ ప్రొటీస్తో మ్యాచ్ ఆడడం లేదని పాక్ జట్టు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే హసన్ అలీ ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొనలేదు.
అయితే అతడు కోలుకుంటున్నాడని, కానీ తదుపరి మ్యాచ్లకు పూర్తి ఫిట్నెస్తో ఉండాలనే ఆలోచనతోనే ఈ మ్యాచ్లో అతడికి విశ్రాంతి నిచ్చినట్లు టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే హసన్ స్థానంలో మహ్మద్ వసీం జూనియర్కు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.