అత్యంత పేలవ ఫామ్లో ఉన్న పాకిస్తాన్ టీంపై ఇటీవలి కాలంలో తెగ విమర్శలు వస్తున్నాయి. అందరూ కూడా పాక్ ఆటతీరు చెత్తగా ఉందని, బాబర్ కెప్టెన్సీ అంతకన్నా బాగలేదని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆ టీం మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ మండిపడ్డాడు. అనాల్సింది ఆటగాళ్లను కాదని, కోచింగ్ సిబ్బందినని చెప్పాడు.
పాక్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మిక్కీ ఆర్థర్ను సల్మాన్ బట్ ఏకిపారేశాడు. అతను జట్టు కోచ్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ టెస్టులు ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశాడు. 'టెస్టు టీం బ్యాటర్లు కొంత మంది మరీ నెమ్మదిగా ఆడుతున్నారని ఆర్థర్ చెప్పాడు. వాళ్లను వేగంగా ఆడాలని ఒత్తిడి పెంచాడు. దాని వల్ల ఏం ఫలితం వచ్చింది?' అని నిలదీశాడు.

ఆర్థర్ సలహాల వల్ల పాకిస్తాన్ జట్టు మూడు రోజుల్లోనే టెస్టు మ్యాచులు ఓడిందని చెప్పాడు. ఇలాంటి చెత్త నిర్ణయాలు ఆర్థర్ చాలా తీసుకున్నాడని మండిపడ్డాడు. ఇక వరల్డ్ కప్లో భారత్ చేతిలో ఓడిన తర్వాత అతను చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబట్టాడు. మ్యాచ్ ఎందుకు ఓడిపోయాం? ప్లేయర్ల సమస్యలు ఏంటి? అని చెప్పాల్సింది పోయి చెత్త కామెంట్స్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ ఓడిపోయిన తర్వాత 'దిల్ దిల్ పాకిస్తాన్' పాట పెట్టలేదు, ఐసీసీ ఈవెంట్లా కాకుండా బీసీసీఐ ఈవెంట్లా ఉంది, ప్లేయర్లను ఫ్యాన్స్ తిట్టారు.. ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని బట్ ప్రశ్నించాడు. ఇలాంటి వింత కేరక్టర్ను ఇంకా జట్టులో ఎలా ఉంచుతున్నారు? అసలు అతనిలో ఏం ట్యాలెంట్ చూసి కోచ్గా కొనసాగిస్తున్నారు? అని అడిగాడు.

'అసలు జట్టులో మిక్కీ ఆర్థర్కు జట్టులో వేరే ఏదైనా పాత్ర ఉందా? అతనో వింత మనిషి. ఇంకా కోచ్గా ఎందుకు ఉన్నాడో?' అన్నాడు. అలాగే చీఫ్ సెలెక్టర్గా ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేయడం గురించి కూడా మాట్లాడాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో చాలా తప్పు విషయాలు ఒకేసారి జరుగుతున్నాయని అభిప్రాయపడ్డాడు.