వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే దాయాది దేశం పాకిస్తాన్ తప్పక గెలవాల్సిన మ్యాచ్కు రెడీ అవుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచులో బంగ్లాదేశ్ను ఢీకొట్టనుంది బాబర్ సేన. ఈ మ్యాచ్ కూడా ఓడితే ఇక పాకిస్తాన్ ఈ టోర్నీ సెమీస్ రేసు నుంచి పూర్తిగా అవుట్ అయిపోయినట్లే.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ చాలా డ్రైగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. తమకు ఇక పోయేదేం లేదని, అందుకే పాజిటివ్గా ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. నిలకడలేకపోవడమే తమ జట్టును బాగా బాధిస్తోందన్నాడు.

తమ టీంలో ఒకే ఒక్క మార్పు చేశామని చెప్పిన అతను.. మెహదీ హసన్ ఆడటం లేదని, అతని స్థానంలో హృదోయ్ వచ్చాడని తెలిపాడు. తను టాస్ గెలిచి ఉంటే ముందుగా బ్యాటింగ్ చేసే వాడినని బాబర్ కూడా అన్నాడు. చివరి మ్యాచులో తాము బాగానే రాణించామని, కానీ ఓడిపోయామని చెప్పుకొచ్చాడు.
తను భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉందని, తను కూడా దాని కోసమే వెయిట్ చేస్తున్నానని అన్నాడు. తమ టీంలో మూడు మార్పులు చేశామన్న అతను.. ఇమామ్ ఉల్ హక్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్ ఆడటం లేదన్నాడు. వీరి స్థానంలో ఫఖర్ జమాన్, ఉసామా మీర్, ఆఘా సల్మాన్ ఆడుతున్నాడని పేర్కొన్నాడు.