ఆఫ్ఘనిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడి పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ను ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మరింత అవమానించాడు. ప్రపంచం అంతా చూస్తుండగా లైవ్లో పాక్ పరువు తీశాడు. చెన్నై వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో పాకిస్తాన్ను ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచులో ఆఫ్ఘన్ ఛేజింగ్లో ఆ టీం ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (87) కీలక పాత్ర పోషించాడు. సెంచరీ కూడా పూర్తి చేసుకుంటాడని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. హసన్ అలీ వేసిన బంతిని ఆఫ్సైడ్ ఆడబోగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ రిజ్వాన్ చేతుల్లో పడింది.

అయితే ఆ తర్వాత వచ్చిన రహ్మత్ షా (77 నాటౌట్), హష్మతుల్లా షాహిదీ (48 నాటౌట్) ఇద్దరూ పట్టుదలగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ విజయంలో అద్భుతమైన పోరాట పటిమ చూపించిన అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న సమయంలో మాట్లాడిన జద్రాన్.. పాక్ పరువు తీశాడు.
'పాకిస్తాన్ నుంచి తరిమేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులకు నా అవార్డును అంకితం ఇస్తున్నా' అని జద్రాన్ అన్నాడు. ఈ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు కైవసం చేసుకున్న తర్వాత వేలాదిమంది ఆఫ్ఘన్లు చుట్టుపక్కల దేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొంత మంది పాకిస్తాన్ కూడా వెళ్లారు.
ఇప్పుడు వాళ్లందర్నీ తిరిగి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోవాలని పాక్ ఆదేశించింది. ధ్రువ పత్రాలు లేని శరణార్థులందరూ కూడా నవంబరు 1 నాటికి పాక్ విడిచి వెళ్లాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 21న సుమారు 3248 మంది ఆఫ్ఘన్లు.. పాక్ నుంచి తిరిగి ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అదే సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సుమారు 51 వేల ఆఫ్ఘన్లను వాళ్ల దేశం పంపేసినట్లు పాకిస్తాన్ అధికారులు చెప్తున్నారు. ఇక నవంబరు 1 తర్వాత ఆఫ్ఘన్ నుంచి ఎవర్నీ పాకిస్తాన్లోకి రానివ్వబోరని సమాచారం. పాక్-ఆఫ్ఘన్ బోర్డర్ను పూర్తిగా మూసివేయాలని పాక్ అనుకుంటోందట.
కాగా పాకిస్తాన్లో ఉంటున్న 17 లక్షల మందికిపైగా ఆఫ్ఘన్లకు సరైన ధ్రువపత్రాలు లేవని తెలుస్తోంది. ఇప్పుడు వారందర్నీ ఆఫ్ఘనిస్తాన్ పంపించేయాలని పాక్ ప్రయత్రిస్తోంది. ఈ క్రమంలో జద్రాన్ చేసిన వ్యాఖ్యలు.. పాక్ పరువు తీస్తున్నాయని కొందరు పాకిస్తానీలు ఫీల్ అవుతున్నారు.